Publish Date: Sat, 30 Mar 2019 (12:13 IST)
Updated Date: Sat, 30 Mar 2019 (13:18 IST)
చాలామంది తల్లిదండ్రులు పిల్లలు సరిగ్గా చదవలేదని బాధపడుతుంటారు. వారిలో చదివే అలవాటు పెంచాలంటే.. ఓ పుస్తకం చేతికి ఇవ్వడం పరిష్కారం కాదు. అందుకు కొన్ని మార్గాలున్నాయి. వాటిని అనుసరిస్తే తప్పకుండా వాళ్లకు పుస్తక పఠనంపై ఆసక్తి పెరుగుతుంది.
ఇప్పటి కాలంలో చదువుకుంటేనే మంచిది. చదవడం వలన ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో మనకు తెలుసు. అది పిల్లలకు అర్థంకావాలంటే వారికి ముందు ఆసక్తికరమైన కథలు చెప్పాలి. దానివలన మరికొన్ని కథలు తెలుసుకోవాలనే ఉత్సాహం వారిలో కలుగుతుంది. అప్పుడు మీరో కథల పుస్తకాన్ని ఇచ్చినా.. ఇష్టంగా చదివేందుకు ఆసక్తి చూపిస్తారు.
ప్రతిరోజూ ఓ కథల పుస్తకాన్నో లేదా మరొకటో వారితో చదివించే అలవాటు చేయడం వలన ఏకాగ్రత పెరుగుతుంది. ఒక్కసారి వారికి అలవాటు అయితే మాత్రం.. మీ సహాయం లేకుండానే వారు పుస్తకాలు చేతుల్లోకి తీసుకుంటారు. అలానే మీరు ఎప్పటికప్పుటు వారిని ప్రశ్నలు వేయాలి.. లేదా రాయించాలి. ఇలా చేస్తుంటే.. వాళ్లు ఎంతవరకూ చదువుతున్నారనేది తెలుస్తుంది. ముఖ్యంగా పుస్తకం చదివించడం అంటే ఏదో ఒకటిలే అనుకోకండి. పిల్లల ఆసక్తిని తెలుకోవడం ఎంతైన ముఖ్యం.