ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గణనీయంగా మెరుగైన ప్రదర్శనను ప్రదర్శించింది. సోమవారం ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో ఆ జట్టు భారీ స్కోరు నమోదు చేసింది. విరాట్ కోహ్లీ- దేవదత్ పడిక్కల్, కెప్టెన్ రజత్ పాటిదార్, వికెట్ కీపర్ జితేష్ శర్మ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడారు.
టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 221 పరుగులు చేసింది. ఓపెనర్ ఫిల్ సాల్ట్ కేవలం 4 పరుగులకే ఔటైనా, విరాట్ కోహ్లీ, దేవదత్ పడిక్కల్ భాగస్వామ్యం ఇన్నింగ్స్ను స్థిరపరిచింది. విరాట్ కోహ్లీ 42 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్సర్లతో సహా 67 పరుగులు చేశాడు. తద్వారా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ చరిత్ర సృష్టించాడు. టీ20 క్రికెట్లో 13 వేల పరుగుల మైలురాయి అందుకున్న తొలి భారత బ్యాటర్గా నిలిచాడు. వాంఖడే వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో విరాట్ కోహ్లీ ఈ ఫీట్ సాధించాడు.
ఈ మ్యాచ్కు ముందు 13 వేల పరుగుల క్లబ్లో చేరేందుకు విరాట్ కోహ్లీ 17 పరుగుల దూరంలో నిలిచాడు. ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన మూడో ఓవర్లో చివరి రెండు బంతులను కోహ్లీ బౌండరీలు బాది 13వేల పరుగుల మైలురాయిని అందుకున్నాడు. ఓవరాల్గా ఈ ఘనతను అందుకున్న ఐదో బ్యాటర్గా నిలిచాడు. అత్యంత వేగంగా ఈ ఫీట్ సాధించిన రెండో బ్యాటర్గా రికార్డ్ సాధించాడు. ఇక దేవదత్ పడిక్కల్ 22 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సర్లతో 37 పరుగులు జోడించాడు.
కెప్టెన్ రజత్ పాటిదార్ దూకుడుగా ఆడి అర్ధ సెంచరీ నమోదు చేశాడు. అతను 32 బంతుల్లో 5 ఫోర్లు, 4 సిక్సర్లతో 64 పరుగులు చేశాడు. జితేష్ శర్మ 19 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. లియామ్ లివింగ్స్టోన్ డకౌట్గా ఔటయ్యాడు.
ముంబై ఇండియన్స్ బౌలర్లలో ట్రెంట్ బౌల్ట్, కెప్టెన్ హార్దిక్ పాండ్యా తలా రెండు వికెట్లు పడగొట్టగా, విఘ్నేశ్ పుత్తూర్ ఒక వికెట్ తీశారు. దాదాపు 93 రోజుల తర్వాత క్రికెట్లోకి తిరిగి వచ్చిన ఫాస్ట్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా ఒక్క వికెట్ కూడా తీయలేకపోయాడు. అతను నాలుగు ఓవర్లు బౌలింగ్ చేసి 29 పరుగులు ఇచ్చాడు. జస్ప్రీత్ బుమ్రా బౌలింగ్లో సిక్స్ కొట్టి విరాట్ కోహ్లీ మైదానంలోకి తిరిగి స్వాగతం పలకడం మ్యాచ్లో హైలైట్.