Publish Date: Thu, 24 Mar 2022 (14:53 IST)
Updated Date: Thu, 24 Mar 2022 (14:57 IST)
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) క్షయవ్యాధి ప్రపంచంలోని అత్యంత ఘోరమైన అంటువ్యాధుల కిల్లర్లలో ఒకటని పేర్కొంది. ఈ వ్యాధి కారణంగా ప్రతిరోజూ, 4,100 మందికి పైగా ప్రజలు ప్రాణాలను కోల్పోతున్నారు. అలాగే క్షయవ్యాధి ఫలితంగా సుమారు 28,000 మంది అస్వస్థతకు గురవుతున్నారు. ఇది నిరోధించదగిన మరియు నయం చేయదగిన వ్యాధి అయినప్పటికీ మృతుల సంఖ్య మాత్రం తగ్గట్లేదు.
అయితే 2000 నుంచి, క్షయను నిర్మూలించడానికి ప్రపంచవ్యాప్తంగా చేసిన ప్రయత్నాలు 66 మిలియన్ల ప్రాణాలను కాపాడాయని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. అయితే, కోవిడ్-19 మహమ్మారి వ్యాధికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో క్షయ వ్యాధిపై సంవత్సరాల పాటు సాధించిన పురోగతికి బ్రేక్ పడింది. 2020లో క్షయ మరణాలు ఒక దశాబ్దానికి పైగా పెరిగాయి.
ఇకపోతే.. ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవం ప్రతి సంవత్సరం మార్చి 24 న జరుపుకుంటారు. జర్మన్ వైద్యుడు, బాక్టీరియాలజీ స్థాపకులలో ఒకరైన డాక్టర్ రాబర్ట్ కోచ్ 1882 లో క్షయవ్యాధికి కారణమయ్యే బ్యాక్టీరియాను కనుగొన్నారు, ఇది వ్యాధి నిర్ధారణ, చికిత్సకు మార్గం సుగమం చేసింది.
ఈ వ్యాధి గురించి అవగాహన పెంపొందించడానికి, అలాగే ప్రపంచ క్షయవ్యాధి మహమ్మారిని ఆపడానికి ప్రయత్నాలను తీవ్రతరం చేయడానికి ప్రపంచ క్షయవ్యాధి దినోత్సవాన్ని జరుపుకుంటారు
ఇందుకోసం ఈ ఏడాది "టీబీని అంతం చేయడానికి పెట్టుబడి పెట్టండి. ప్రాణాలను కాపాడండి" అనే థీమ్ను ఎంచుకోవడం జరిగింది.
ఇకపోతే.. డాక్టర్ కోచ్ మార్చి 24, 1882న క్షయవ్యాధికి కారణమయ్యే మైకోబాక్టీరియం ట్యూబర్క్యులోసిస్ అనే బ్యాక్టీరియాను కనుగొన్నట్లు నివేదించారు. ఆ సమయంలో, క్షయవ్యాధి అమెరికా, ఐరోపాలో ప్రతి ఏడుగురిలో ఒకరిని పొట్టనబెట్టుకుందని సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ తెలిపింది.