పరీక్షల్లో తక్కువ మార్కులు వస్తే విద్యార్థులకు ఉపాధ్యాయులు లేదంటే పేరెంట్స్ సున్నితమైన దేహశుద్ధి చేస్తుంటారు. అది కూడా కొన్నిసార్లు. ఐతే ఇక్కడ సీన్ రివర్స్ అయ్యింది. తనకు తక్కువ మార్కులు ఎందుకు వచ్చాయంటూ ఓ విద్యార్థి ఏకంగా తన ఉపాధ్యాయురాలి చెంపను ఛెళ్లుమనిపించాడు. పూర్తి వివరాలు ఇలా వున్నాయి.
థాయిలాండ్లో 17 ఏళ్ల విద్యార్థి మిడ్ టర్మ్ పరీక్షలో రెండు మార్కులు తక్కువ వచ్చాయి. దానితో అతడు తన గణిత ఉపాధ్యాయురాలిపై హింసాత్మకంగా దాడి చేసాడు. ఈ సంఘటన ఆగస్టు 5న ఉతై థాని సెంట్రల్ ప్రావిన్స్లోని ఒక ప్రైవేట్ పాఠశాలలో జరిగింది. విద్యార్థికి తను రాసిన పరీక్షలో 20కి 18 మార్కులు వచ్చాయి. ఐతే ఆ విద్యార్థి తనకు 20 మార్కులకు 20 ఎందుకు వేయలేదంటూ మహిళా ఉపాధ్యాయురాలిని తరగతి గదిలోనే పదే పదే చెంపదెబ్బ కొట్టడం, తన్నడం చేసాడు. ఇవి సీసీటీవీ ఫుటేజ్లో రికార్డ్ కావడంతో ఆ దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.