Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన వ్యక్తి ఇవాళ భారత ప్రధాని : పీఎం మోడీ

రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన వ్యక్తి ఇవాళ భారత ప్రధాని : పీఎం మోడీ
, శనివారం, 25 సెప్టెంబరు 2021 (20:13 IST)
ప్రతి వ్యక్తీ సంతోషంగా ఉండాలన్నదే భారతీయ తత్వమని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అన్నారు. ప్రస్తుతం అగ్రరాజ్యం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోడీ... శనివారం ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీలో ప్రసంగించారు. ఆయన ప్రసంగం హిందీలో కొనసాగింది. ఈ కార్యక్రమానికి భారత విదేశాంగ మంత్రి జై శంకర్, దౌత్యాధికారులు కూడా హాజరయ్యారు. 
 
ఈ సందర్భంగా ప్రధాని మోడీ ప్రసంగిస్తూ, తమ దేశంలో వేల సంవత్సరాలుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందన్నారు. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లయిందని, దేశంలోని వైవిధ్యమే ప్రజాస్వామ్యాన్ని బలంగా మార్చిందన్నారు. 
 
ప్రజాస్వామ్య వికాసానికి భారత్ ఒక ఉదాహరణ అని గుర్తుచేశారు. బాల్యంలో రైల్వే స్టేషన్‌లో టీ అమ్మిన వ్యక్తి, ఇవాళ ఓ దేశానికి ప్రధాని హోదాలో ఐక్యరాజ్యసమితిలో ప్రసంగిస్తున్నాడని, ప్రజాస్వామ్యంలో ఏదైనా సాధ్యమేనని ఉద్ఘాటించారు. 
 
ప్రజాస్వామ్య మాతగా వెలుగొందుతున్న భారత్ కు తాను ప్రాతినిధ్యం వహిస్తున్నానని వెల్లడించారు. సమాజంలో ప్రతి వ్యక్తి సంతోషంగా ఉండాలనేదే భారతీయ తత్వం అని పేర్కొన్నారు. 
 
వందేళ్లలో ఎన్నడూ చూడనంత విపత్తును కరోనా తీసుకువచ్చిందని, అయితే కరోనా సంక్షోభ సమయంలోనూ తాము దేశంలో 3 కోట్ల ఇళ్లు కట్టించి ఇచ్చామన్నారు. కరోనా వేళ డీఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేసి ప్రపంచానికి అందించామని చెప్పారు. 
 
ఎం ఆర్ఎన్ఏ ఆధారిత వ్యాక్సిన్, ముక్కులో వేసే వ్యాక్సిన్ కూడా వస్తున్నాయని వెల్లడించారు. కరోనా సమయంలో తాము తీసుకువచ్చిన కొవిన్ యాప్ అద్భుతంగా పనిచేసిందని చెప్పారు. భారత్ అనేక డిజిటల్ సంస్కరణలు తీసుకువచ్చిందని, భారత్ తెచ్చిన సంస్కరణలు ప్రపంచ గతినే మార్చుతాయన్న నమ్మకం ఉందన్నారు. 
 
భారతదేశ అభివృద్ధి ప్రపంచానికి చోదకశక్తిగా మారుతోందని ప్రధాని మోడీ వివరించారు. అందుకు సైన్స్, టెక్నాలజీ తోడ్పాటు అందిస్తున్నాయని తెలిపారు. దేశంలోని 6 లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేసినట్టు ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీకి వివరించారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చెల్లి శీలంపై కాటేసిన అన్న... ఎక్కడ?