Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒక్క చేప, ఆ జాలరిని లక్షాధికారిని చేసింది

ఒక్క చేప, ఆ జాలరిని లక్షాధికారిని చేసింది
, మంగళవారం, 1 జూన్ 2021 (12:15 IST)
ఓ అరుదైన విలువైన చేప వలలో పడింది.. ఇంకేముంది ఆ మత్స్యకారుడి పంట పండింది. ఆ ఒక్క చేప లక్షల రూపాయలకు అమ్ముడై... ఆ మత్స్యకారుడిని లక్షాధికారిని చేసింది !

పాకిస్థాన్‌లోని బలూచిస్థాన్‌ ప్రావిన్స్‌లోని గ్వాదర్‌ తీరానికి చెందిన మత్స్యకారుడు సాజిద్‌ హాజీ అబాబాకర్‌ ఒకే ఒక చేపను పట్టాడు. ఏకంగా రూ.72 లక్షలు సంపాదించాడు. అబాబాకర్‌ పట్టింది మామూలు చేప కాదు. అరుదైన అట్లాంటిక్‌ క్రోకర్‌ జాతికి చెందినది. అందుకే 48 కేజీల బరువైన ఈ చేపకు వేలంలో ఏకంగా రూ.72 లక్షల ధర పలికింది.
 
యూరప్‌, చైనాల్లో ఈ క్రోకర్‌ జాతికి అత్యధిక డిమాండ్‌ ఉంది. చాలా చేపల విలువ వాటి మాంసం ఆధారంగా నిర్ణయమవుతుంది. క్రోకర్‌ జాతి చేప విషయం వేరు మరి. వైద్యపరంగా ఈ చేపలకు అంతర్జాతీయ మార్కెట్‌లో భారీ డిమాండ్‌ ఉంది. దీని చర్మాన్ని, ఎముకలను ఔషధాల్లో, ఇతర వైద్యపరమైన అంశాల్లో వాడతారు. అందుకే దీనికి అంత ధర. నిజానికి వేలంలో ధర ఇంకా ఎక్కువే పలికింది.

రూ 86.4 లక్షల వరకు వెళ్లింది. అయితే అంత ధరకు చేజిక్కించుకున్నవారికి రాయితీ ఇవ్వడం స్థానికంగా సంప్రదాయం. అందుకే అధికారులు చివరికి రూ.72 లక్షలుగా ధరను ఖరారు చేశారు. గతవారం కూడా గ్వాదర్‌ తీరంలోనే ఒక మత్స్యకారుడు ఈ క్రోకర్‌ జాతి చేపను పట్టాడు. వేలంలో అది రూ.7.8 లక్షలకు అమ్ముడైంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జగన్ బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణ 14కు వాయిదా