Publish Date: Tue, 02 Jan 2024 (08:57 IST)
Updated Date: Tue, 02 Jan 2024 (08:57 IST)
పాకిస్థాన్ దేశంలో గత కొన్ని నెలులుగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో ఉగ్రవాదులు వరుసగా హతమవుతున్నారు. తాజాగా జైషే మహ్మద్ చీఫ్, పుల్వామా దాడి ఘటన ప్రధాన
సూత్రధారి మసూద్ అజహర్పై బాంబు దాడి జరిగిందని, ఈ దాడిలో ఆయన ప్రాణాలు కోల్పోయినట్టు సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్లు కొడుతుంది. సోమవారం ఉదంయ 5 గంటల ప్రాంతంలో పాకిస్థాన్లోని భవల్పుర మసీదు నుంచి మసూద్ తిరిగి వస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు బాంబు దాడికి పాల్పడినట్టు ఆ కథన సారాంశం. ఈ ఘటనలో అతడు అక్కడిక్కకడే ప్రాణాలు కోల్పోయారన్న ప్రచారం సాగుతుంది. అయితే, ఈ వార్తలపై పాకిస్థాన్ ప్రభుత్వం లేదా ఆ దేశ ఆర్మీ గానీ ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
నిజానికి కరుడుగట్టిన ఉగ్రవాది అయిన మసూద్ అజహర్.. భారత్లో అనేకమంది అమాయకుల ప్రాణాలు పొట్టనబెట్టుకున్నాడు. మసూద్ అజహర్ ఎప్పటి నుంచో భారత్కు మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదిగా ఉన్నాడు. 1995లో మసూద్ అజహర్ను భారత్ అరెస్ట్ చేసినప్పటికీ, కొందరు ఉగ్రవాదులు 1999లో విమానాన్ని హైజాక్ చేసి అతడిని విడిపించుకుపోయారు. ఆ తర్వాతే అతడు జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థను స్థాపించి భారత్ పై అనేక ప్రతీకారదాడులు చేశాడు.
మూడేళ్ల కిందట పుల్వామాలో ఆర్మీ కాన్వాయ్పై జరిగిన ఉగ్రదాడిలో 40 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ దాడికి సూత్రధారి మసూద్ అజహరే. అంతకుముందు, 2001లో భారత పార్లమెంటుపై జరిగిన దాడి, 2008 ముంబై బాంబు పేలుళ్లకు కూడా మసూద్ అజహరే వ్యూహరచన చేశాడు. కాగా, పుల్వామా ఘటన తర్వాత ఐక్యరాజ్యసమితి అజహర్ మసూద్ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. ఐరాస ప్రకటన నేపథ్యంలో, మసూద్ అజహర్ తమ దేశంలో లేడని పాకిస్థాన్ చెబుతూ వస్తోంది. ఒకవేళ మసూద్ అజహర్ నిజంగానే చనిపోయినా, పాకిస్థాన్ ఆ విషయం అంగీకరించే పరిస్థితి లేదు.