గాజా స్ట్రిప్పై ఇజ్రాయెల్ మరోమారు నిప్పుల వర్షం కురిపించింది. ఈ దాడుల్లో 66 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇజ్రాయెల్ దళాలు గాజాలోని పలు ప్రాంతాలపై అర్థరాత్రి భీకరమైన దాడులు చేశాయి. ఈ దాడుల్లో నిరాశ్రయులు, తలదాచుకుంటున్న నివాసాలు, శిబిరాలు లక్ష్యంగా మారడంతో పెద్ద ఎత్తున ప్రాణనష్టం జరిగినట్టు తెలుస్తోంది. మొత్తం 66 మంది పాలస్తీనియులు మరణించినట్టు గాజా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
ఈ శాఖ లెక్కల ప్రకారం ఖాన్ యూనిస్లో 20 మంది, ఉత్తర గాజాలో 36 మంది, జబాలియాలోని శరణార్ధి శిబిరంలో మరో 10 మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఏడుగురు చిన్నారులు ఉండటం గమనార్హం. ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ఈ దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. పదుల సంఖ్యలో ప్రజలు గాయపడగా వారిని సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే, ఈ తాజా దాడులపై ఇజ్రాయేల్ సైన్యం ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన చేయలేదు.
ఈ దాడుల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవల కీలక వ్యాఖ్యలు చేశారు. కాల్పుల విరమణ ఒప్పందాన్ని కొనసాగించేందుకు హమాస్ నిరాకరించడం వల్లే ఈ దాడులను తీవ్రతం చేయాల్సి వచ్చిందని ఆయన తెలిపారు.