Publish Date: Fri, 01 Nov 2019 (08:00 IST)
Updated Date: Fri, 01 Nov 2019 (08:01 IST)
ఇస్లామిక్ స్టేట్(ఐఎస్) ఉగ్రవాద సంస్థకు కొత్త బాస్ వచ్చాడు. అగ్రనేత అబూబకర్ అల్ బాగ్దాదీ మృతి అనంతరం తమ కొత్త నాయకుడి పేరును తాజాగా ప్రకటించింది.
ఐఎస్ ఉగ్రవాద సంస్థ కొత్త చీఫ్గా అబూ ఇబ్రహీం అల్ హష్మీ ఎంపికయ్యారని ఆ సంస్థ సెంట్రల్ మీడియా, అల్ ఫుర్కాన్ ఫౌండేషన్ అధికార ప్రతినిధి గురువారం ఒక ఆడియో ప్రకటన విడుదల చేశారు. అబూ బకర్ అల్ బాగ్దాదీతోపాటు అతని సన్నిహిత అనుచరుడు అబు హసన్ అల్ ముహాజిర్ మరణించారని ఐఎస్ అధికార ప్రతినిధి తన ఆడియో సందేశంలో ధ్రువీకరించారు.
దశాబ్దకాలంగా ప్రపంచాన్ని వణికించిన నరరూప రాక్షసుడైన బాగ్దాదీ సిరియాలోని అద్లిబ్ ప్రాంతంలోని ఓ రహస్య స్థావరంలో ఉండగా అమెరికా దళాలు మట్టుబెట్టాయి. ఐఎస్ కొత్త నాయకుడు అబూ ఇబ్రహీం అల్ హష్మీ పట్ల విధేయత ప్రతిజ్ఞ చేయమని అధికార ప్రతినిధి అనుచరులను కోరారు.
అమెరికన్లను ఉద్ధేశించి అధికార ప్రతినిధి మాట్లాడుతూ.. బాగ్దాదీ మృతిపై ‘సంతోషించవద్దు’ అని పేర్కొన్నారు. ఐఎస్ కొత్త నాయకుడు పండితుడు, ప్రసిద్ధ యోధుడు, యుద్ధ వీరుడని, అతను అమెరికన్ దళాలతో పోరాడుతాడని అధికార ప్రతినిధి విడుదల చేసిన ఆడియో సందేశంలో పేర్కొన్నాడు.