Publish Date: Mon, 22 Feb 2021 (10:40 IST)
Updated Date: Mon, 22 Feb 2021 (10:41 IST)
కరోనా వైరస్ మహమ్మారితో ఇకపై సహజీవనం చేయక తప్పదని బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ అభిప్రాయపడ్డారు. భారత్తో పాటు పలు దేశాల్లో కరోనా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో పలు ప్రాంతాల్లో లాక్డౌన్ అమలు చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ప్రధాని బోరిస్ జాన్సన్, తన సహచరులతో మాట్లాడుతూ, స్కూళ్లు, షాపింగ్ మాల్స్, థియేటర్లు, ఉద్యోగ కేంద్రాల్లో భారీ ఎత్తున నమూనాలను సేకరించి, పరీక్షలు జరిపించాలని, కరోనాతో సహజీవనం చేసేలా ప్రజలను సమాయత్తం చేయాలని పేర్కొన్నారు.
ఈ మేరకు సోమవారం జరగనున్న పార్లమెంట్ సమావేశంలో లాక్ డౌన్, వ్యాక్సినేషన్ తదనంతర పరిస్థితులపై రోడ్ మ్యాప్ ను సిద్ధం చేయాలని ఆయన సూచించారు.
నిత్యం వేలాదిగా పరీక్షలను నిర్వహించాలని, ముఖ్యంగా సెకండరీ పాఠశాలలకు వచ్చే విద్యార్థులపై దృష్టిని సారించాలని నిర్ణయించామని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి డొమినిక్ రాబ్ తెలిపారు. రోజువారీ జీవితంలో కరోనా కూడా ఓ భాగమై పోయిందని, దాన్ని ఎదుర్కొంటూనే జీవించాల్సి వుందని ఆయన అన్నారు.
ఈ నేపథ్యంలోనే వైరస్తో కలసి జీవించాలని ప్రజలకు సూచిస్తున్న బోరిస్ ప్రభుత్వం, కొవిడ్ మార్గదర్శకాలను ప్రజలు తప్పనిసరిగా పాటిస్తూ, మహమ్మారిని ఎదుర్కోవాలని చెబుతోంది. ఇంతకుమించి మరో మార్గం లేదని స్పష్టం చేస్తోంది.
కాగా, తమ దేశ ప్రజలకు కరోనా టీకాను అందించడంలో యూరోపియన్ యూనియన్ మొత్తంలో బ్రిటన్ ముందు నిలిచినప్పటికీ, తదుపరి ఏంటన్న ప్రశ్న ప్రధాని బోరిస్ జాన్సన్ పై ఒత్తిడిని పెంచుతోంది.
కొవిడ్ను ఎదుర్కోవడడంలో పాటించాల్సిన విధానాలను సమర్థవంతంగా అమలు చేయడంలో ఇజ్రాయెల్ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన వేళ, యూకేలో మాత్రం లాక్డౌన్ కారణంగా ఏర్పడిన నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం నానా అవస్థలూ పడుతోంది.