Publish Date: Fri, 19 Feb 2021 (12:33 IST)
Updated Date: Fri, 19 Feb 2021 (12:34 IST)
అమెరికాలోని కాలిఫోర్నియా రాష్ట్రంలో విచిత్రమైన కేసు ఒకటి నమోదైంది. ఓ కుటంబంలో భార్యాభర్తలిద్దరికీ కరోనా సోకింది. భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న క్లారిటీతో ఆ భార్య ఉంది. అందుకే కోర్టు మెట్లెక్కింది. ఆమె ఫిర్యాదు చేసింది భర్తపై కాకపోవడమే ఇక్కడ విచిత్రం. కాలిఫోర్నియాలో రాబర్ట్ కుసీంబా అనే వ్యక్తి 65 ఏళ్ల వ్యక్తి విక్టరీ ఉడ్ వర్క్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు.
గతేడాది జూలై 16న అతడికి, అతడి భార్య కోర్బీ కుసీంబాకు కరోనా సోకింది. ఇద్దరూ వెంటిలేటర్పై ఉండి మరీ ఆస్పత్రిలో చికిత్స తీసుకున్నారు. అదృష్టవశాత్తు బయటపడగలిగారు. అయితే రాబర్ట్ భార్య కోర్బీ ఈ ఘటనపై సీరియస్ అయింది. తన భర్త వల్లే తనకు కరోనా సోకిందన్న నిర్ణయానికి వచ్చింది. అంతేకాకుండా భర్తకు కరోనా రావడానికి కారణం అతడు పనిచేసే కంపెనీయేనన్న ఆరోపణలు చేస్తోంది.
సరైన వర్క్ ప్లేస్ను కల్పించకుండా, ఆఫీసులో కరోనా నిబంధనలు పాటించకపోవడం వల్లే తన భర్తకు కరోనా సోకిందనీ, అతడి ద్వారా తనకు కూడా వ్యాప్తి చెందిందన్న ఆరోపణలతో ఆగస్టు నెలాఖరులో కాలిఫోర్నియా కోర్టులో పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ను అతి త్వరలోనే యూఎస్ డిస్ట్రిక్ట్ జడ్జ్ మక్సైన్ ఎం.చెస్నీ విచారించనున్నారు.