Publish Date: Tue, 16 Feb 2021 (09:07 IST)
Updated Date: Tue, 16 Feb 2021 (09:10 IST)
కాంగో నదిలో ఓ ఓడ ప్రమాదవశాత్తు బోల్తా పడిన ఘటనలో 60 మంది ప్రయాణికులు మృతి చెందారు. మాయి నోడోంబీ ప్రావిన్స్లోని లాంగోలా ఎకోటి గ్రామానికి సమీపంలోని నదిలో ఓడ ప్రమాదవశాత్తు బోల్తా పడి మునిగిపోయింది. ప్రమాద సమయంలో ఓడలో 700 మంది ప్రయాణికులున్నారని కాంగో మంత్రి ఎంబీకాయి వెల్లడించారు.
ఈ ప్రమాదంలో 300 మంది వరకు ప్రాణాలతో బయటపడ్డారని, మరికొంత మంది గల్లంతయ్యారని ఆయన చెప్పారు. ఈ ఓడ కిన్హాసా నుంచి బయలుదేరి భూమధ్య రేఖ ప్రావిన్స్ వైపు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పడవలో ఎక్కువ మంది ప్రయాణికులు ఉండటంతో అధిక లోడ్ అయి పడవ మునిగిపోయినట్లు మంత్రి వివరించారు.
అయితే పడవ మునిగినట్లు సమాచారం తెలియగానే సహాయక చర్యలు ముమ్మరం చేసినట్లు చెప్పారు. గల్లంతైన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు.