Publish Date: Sat, 04 Sep 2021 (19:56 IST)
Updated Date: Sat, 04 Sep 2021 (19:58 IST)
తులసి ఆకుల్ని నీడలో ఆరబెట్టి పొడి చేసి తేనె లేదా పెరుగుతో పాటు సేవిస్తే చాలా రోగాలు నివారణ అవుతాయి. పాలతో మాత్రం తీసుకోకూడదు. పొద్దున్నే అల్పాహారానికి అరగంట ముందు తులసి రసాన్ని సేవిస్తే జీర్ణశక్తి మెరుగవుతుంది. రోజుకు మూడు సార్లు కూడా సేవించవచ్చు.
మలేరియా వచ్చినపుడు ఐదు నుంచి ఏడు తులసి ఆకులను నలిపి మిరియాల పొడితో తీసుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది. పది గ్రాముల తులసి రసాన్ని పది గ్రాముల అల్లం రసంతో కలిపి తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
పిల్లలకు వాంతులు అవుతున్నప్పుడు కొద్దిగా తులసి విత్తనాలను పెరుగు లేదా తేనెతో కలిపి నాకిస్తే అవి తగ్గుముఖం పడతాయి. నల్ల తులసి రసాన్ని మిరియాలపొడిలో వేసి ఆ మిశ్రమాన్ని నూనె లేదా నెయ్యితో కలిపి సేవిస్తే గ్యాస్ట్రిక్ బాధల నుంచి ఉపశమనం లభిస్తుంది.
తులసి ఆకులను నీళ్లలో మరిగించి తీసుకుంటే చెవి నొప్పికి మంచి మందుగా పనిచేస్తుంది. నల్ల తులసి ఆకుల్ని ఏడు బాదం పప్పులు, నాలుగు లవంగాలను కలిపి తింటే జీర్ణశక్తికి చాలా మంచిది.
నల్ల తులసి ఆకులు, తేనేను సమపాళ్లలో కలిపి కళ్లకు రాస్తే అలసట తగ్గడమే కాకుండా కంటి చూపు కూడా మెరుగుపడుతుంది. ఇరవై ఐదు గ్రాముల తులసి రసాన్ని రెండు గ్రాముల నల్ల ఉప్పును కలిపి నాలుగు రోజులు క్రమంగా తీసుకుంటే నులిపురుగులు నశిస్తాయి. ఆస్తమా రోగులు ప్రతి రోజూ ఐదు నుంచి ఇరవైఐదు గ్రాముల నల్లతులసి రసాన్ని తేనేతో కలిపి తీసుకుంటే మంచిది.
సిహెచ్
Publish Date: Sat, 04 Sep 2021 (19:56 IST)
Updated Date: Sat, 04 Sep 2021 (19:58 IST)