Publish Date: Fri, 26 Apr 2019 (10:19 IST)
Updated Date: Fri, 26 Apr 2019 (10:23 IST)
సాధారణంగా ప్రతీ ఇంట్లో అన్నం వండేటప్పుడు వచ్చే గంజి నీటిని పారబోస్తుంటారు. అలా చేయడం మంచిది కాదని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే.. గంజి నీరు ఆరోగ్యానికి చాలా మంచిదని చెప్తున్నారు. ఈ నీటిలో మన శరీరానికి ఉపయోగపడే పోషకాలు అధిక మోతాదులో ఉన్నాయని వారు చెప్తున్నారు. అందువలన గంజినీటిని పారబోయకుండా వాటిని గోరువెచ్చగా ఉండగానే అందులో కొద్దిగా ఉప్పు కలిపి తాగితే మంచిది.
ఇప్పటి వేసవికాలం గురించి చెప్పాలంటే.. ఎండలు మండిపోతున్నాయి. ఇక మధ్యాహ్నం సమయంలో అయితే చెప్పాల్సిన అవసరం లేదు. అసలు బయటకు రావాలంటేనే చాలా భయంగా ఉంది. ఒకవేళ వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఏం చేయలేం కదా.. అయితే ఈ వేసవిలో శక్తి త్వరగా అయిపోయి ఎవరైనా సరే నీరసం చెందుతుంటారు. అలాంటి వారు గంజి నీరు తాగితే మంచిది. తక్షణమే శరీరానికి కావలసిన ఎనర్జీ అందుతుంది.
గంజి నీటిలో విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీరానికి కావలసిన పోషణలు పుష్కలంగా అందిస్తాయి. ముఖ్యంగా శరీరంలో విటమిన్ లోపాలు రాకుండా కాపాడుతాయి. ఈ గంజి నీటిని తరచు చిన్నారులకు తాగిస్తుంటే.. వారి ఎదుగుదల సరిగ్గా ఉంటుంది. ఇక పసిపిల్లలు పాలు సరిగ్గా తాగకపోతే వారికి కనీసం గంజి నీటిని అయినా తాగించాలి. అప్పుడే వారికి కావల్సిన ఆహారం అంది శక్తి లభిస్తుంది.
తరచు చాలామంది చర్మం సమస్యలతో బాధపడుతుంటారు. ముఖ్యంగా చెప్పాలంటే.. చర్మ దురదలు ఎక్కువగా ఉంటాయి. అలాంటప్పుడు ఏం చేయాలంటే.. దురద ఉన్న ప్రాంతంలో కొద్దిగా గంజినీటిని పోసి సున్నితంగా మర్దన చేసుకోవాలి. ఇలా చేయడం వలన చర్మ దురదలు తగ్గిపోతాయి. ఇక విరేచనాల విషయానికి వస్తే.. ఈ సమస్యతో బాధపడేవారు గంజి నీటిని తాగితే వెంటనే విరేచనాలు తగ్గుతాయి.