Publish Date: Mon, 05 Aug 2019 (21:35 IST)
Updated Date: Mon, 05 Aug 2019 (21:36 IST)
సాధారణంగా మనం వాతావరణ కాలుష్యం ప్రభావం వల్ల గానీ, సరైన పోషక విలువలు లేని ఆహారం తీసుకోవడం వల్ల గానీ, పని ఒత్తిడి వల్ల గానీ ప్రతి ఒక్కరికి చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు తలెత్తుతుంటాయి.
ప్రతి ఆరోగ్య సమస్యకు మందులు వాడడం వలన అనేక రకములైన సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. అలాకాకుండా మనకు ప్రకృతిలో దొరికే సహజసిద్దమైన మన ఇంట్లోనే లభించే కొన్ని పదార్దాలను ఉపయోగించి ఈ సమస్యలను తగ్గించుకోవచ్చు. ఆ చిట్కాలేమిటో చూద్దాం.
1. దగ్గు, ఛాతీ నొప్పితో బాధపడుతున్నప్పుడు ప్రతిరోజు ఉదయం మూడు కప్పుల నీళ్లల్లో రెండు తమలపాకులు, నాలుగు మిరియాలు వేసి సగం అయ్యేవరకు నీటిని మరిగించి అందులో ఒక టీస్పూను తేనె కలుపుకుని తాగాలి.
2. దగ్గు నుండి ఉపశమనానికి తులసి ఆకులను తేనెతో కలిపి పరగడుపున తీసుకోవాలి.
3. దానిమ్మ తొక్కలను పొడి చేసి ఉదయాన్నే ఒక గ్లాసు నీటిలో ఒక టీస్పూను పొడి కలిపి తీసుకుంటే రక్త శుద్ది జరుగుతుంది.
4. వెన్నునొప్పితో బాధపడేవారు నువ్వులనూనె లేదా ఆముదంలో వెల్లుల్లి రేకలు వేసి అయిదు నిమిషములు సేపు సన్నని మంట మీద మరిగించాలి. ఈ నూనెతో వెన్నుకు మర్దనా చేయాలి. అలాగే వెన్ను నొప్పి ఉన్నచోట అల్లం పేస్టుతో మర్దనా చేసినా నొప్పి తగ్గుతుంది.
5. ఏదైనా గాయాలు తగిలి రక్తం కారుతుంటే చందనం పొడిలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని గాయానికి రాయాలి.