Publish Date: Tue, 23 Apr 2019 (14:34 IST)
Updated Date: Tue, 23 Apr 2019 (14:45 IST)
అనేక రకాల పండ్లు మనకు పలు రకాల పోషణను అందిస్తాయి. కొన్ని దేహదారుఢ్యాన్ని పెంచితే, మరికొన్ని ఔషధాలుగా పనిచేస్తాయి. వీటివల్ల మన శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఈ కాలంలో మనకు ద్రాక్షపండ్లు విరివిగా లభిస్తాయి. ద్రాక్షపండ్లలో వివిధ రకాలు ఉన్నాయి. నలుపు, ఎరుపు, పచ్చ వంటి రంగుల్లో లభ్యమవుతాయి. ఈ పండ్లు మన ఆరోగ్య సంరక్షణకు ఎంతగానో దోహదపడతాయి. వీటిని తరచుగా తినడం వలన కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
నిద్రలేమి సమస్యతో ఎక్కువగా బాధపడేవారు రాత్రివేళలో కప్పు ద్రాక్ష పండ్లు సేవిస్తే సమస్య తగ్గుముఖం పడుతుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. ద్రాక్ష పండ్లను మెత్తగా నలిపి పేస్ట్ చేసి అందులో చక్కెర కలుపుకుని తింటే కడుపులో మంట నుండి ఉపశమనం పొందవచ్చు.
తలనొప్పిగా ఉన్నప్పుడు ఒక గ్లాసు ద్రాక్ష రసాన్ని సేవిస్తే వెంటనే మటుమాయం అవుతుంది. ద్రాక్ష తొక్కలను బాగా ఎండబెట్టి పొడి చేసి దానిని రోజూ పాలలో కలుపుకుని త్రాగితే అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతున్నారు.
ద్రాక్ష పండ్ల గుజ్జును విడిగా తీసుకుని అందులో స్పూన్ మోతాదులో కొద్దిగా తేనె, పెరుగు కలిపి ముఖానికి రాసుకుంటే నల్లటి చారలు, వలయాలు పోయి, ముఖం కాంతివంతంగా మెరుస్తుంది.
ద్రాక్ష పండ్లలోని విటమిన్లు, మినరల్స్ శరీరంలోని విష పదార్థాలు, వ్యర్థాలు బయటకు వెళ్లేలా చేస్తాయి. ద్రాక్ష పండ్లను రోజూ సలాడ్ల రూపంలో తీసుకుంటే మంచిదంటున్నారు వైద్యులు.