Publish Date: Thu, 27 Apr 2023 (19:40 IST)
Updated Date: Thu, 27 Apr 2023 (19:41 IST)
నేటికాలంలో కేన్సర్ అనేది సర్వసాధారణమైన వ్యాధిగా మారిపోయింది. పురుషులు కంటే మహిళలు ఈ వ్యాధిబారినపడుతున్నారు. ముఖ్యంగా రొమ్ము కేన్సర్ వారిని వేధిస్తుంది. పైగా ఈ వ్యాధి వంశపారంపర్యంగా వస్తుంది. తల్లి, పిన్ని, పిన్ని పిల్లలకు కేన్సర్ ఉందంటే వారి సంతానం మాత్రం మరింత జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సలహా ఇస్తున్నారు. ఇందుకోసం మహిళలు తమతోపాటు, తమ ఆడపిల్లల ఆరోగ్యం పట్ల కూడా ఎంతో అప్రమత్తతతో వ్యవహరించాలి సూచిస్తున్నారు.
ఈ వ్యాధి బారినపడకుండా ఉండాలంటే.. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆహారపుటలవాట్లను అనుసరించటం అలవాటు చేసుకోవాలి. స్టాండార్డ్ రిస్క్, హై రిస్క్... ఈ రెండిట్లో ఏ కోవలోకి వస్తామో ప్రతి మహిళా తెలుసుకోవాలి. 22 నుంచి 28 ఏళ్లలోపు పెళ్లి చేసుకుని 30 ఏళ్లలోపే పిల్లలను కని పాలివ్వాలి. ప్రతి ఆడపిల్ల 13 ఏళ్లకు చేరుకున్నప్పటి నుంచి రొమ్ముల్లో వచ్చే మార్పులు గమనించాలి.
40 ఏళ్లు దాటిన ప్రతి మహిళా సంవత్సరానికోసారి మామోగ్రామ్ (రొమ్ముల్లో క్యాన్సర్ కణాల్ని గుర్తించే పరీక్ష) చేయించుకోవాలి. 10 ఏళ్లలోపు మామోగ్రామ్ పరీక్షతో కేన్సర్ని గుర్తించటం కష్టం. కాబట్టి రొమ్ములో ఎలాంటి తేడా కనిపించినా వెంటనే వైద్యుల దృష్టికి తీసుకెళ్లాలి. ఈ వయసులో సూది పరీక్ష (బయాప్సీ)తో కేన్సర్ను వైద్యులు గుర్తించగలుగుతారు. 13 ఏళ్లకు చేరుకున్న పిల్లల రొమ్ముల్లో తేడాలను గమనిస్తూ ఉండాలి.