Publish Date: Wed, 03 Jul 2019 (12:22 IST)
Updated Date: Wed, 03 Jul 2019 (12:28 IST)
ఇప్పుడైతే మనం ఉదయం అల్పాహారంలో భాగంగా ఇడ్లీ, దోశ, వడ వంటివి తింటున్నాం కానీ మన పూర్వికులు చద్దన్నం ఎక్కువగా తినేవారు. అందుకే మన తాతలు, అమ్మమ్మ, నాన్నమ్మలు ఎక్కువ కాలం పాటు ఆరోగ్యంగా జీవించారు. పెద్దల మాట చద్ది మూట అంటారు, అంటే వారి మాట మనకు మేలు చేస్తుందని అర్థం.
రాత్రి వండిన అన్నాన్ని ఉల్లిపాయతో కలిపి పెరుగు లేదా నీళ్లలో నానబెట్టి ఉదయాన్నే తినేవారు. దీన్నే చద్ది అంటారు. ఇది శరీరానికి చలువ చేయడంతో పాటు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఉదయాన్నే చద్దన్నం, పెరుగు కలుపుకుని తింటే ఎన్నో లాభాలు కలుగుతాయి. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి చద్దన్నం బాగా ఉపయోగపడుతుంది.
ఉదయాన్నే చద్దన్నంలో పెరుగు కలుపుకుని తింటే రక్తహీనత నుంచి బయటపడచ్చు. చద్దన్నం తింటే శరీరానికి అవసరమైన కాల్షియం అందుతుంది. దీనివల్ల దంతాలు, ఎముకలు దృఢంగా మారతాయి. వేసవికాలంలో చద్దన్నం తింటే శరీరానికి కావాల్సిన శక్తి అందుతుంది. వడదెబ్బ తగలకుండా రక్షణ కల్పిస్తుంది. ఎండ వల్ల కలిగే నీరసాన్ని నివారిస్తుంది.
అల్సర్లు, పేగు సంబంధ సమస్యలు ఉన్నవారికి చద్దన్నం దివ్యౌషధంలా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్గా తింటే అన్ని అవయవాలకు బలం కలుగుతుంది. చద్దన్నంలో ఉండే బ్యాక్టీరియా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. చద్దన్నం తింటే అధిక రక్తపోటు, మలబద్ధక సమస్యలు దూరమవుతాయి.