Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

తెలంగాణాలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు

తెలంగాణాలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై భౌతిక దాడులు
, సోమవారం, 6 మే 2019 (13:11 IST)
తెలంగాణ రాష్ట్రంలో పార్టీ మారిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ప్రజలు ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నారు. ఎన్నికలకు ముందు ఒక మాట.. గెలిచిన తర్వాత మరో మాట అంటూ నిలదీస్తున్నారు. కొన్ని గ్రామాల్లో అయితే, ఎమ్మెల్యలపై ఏకంగా భౌతిక దాడులకు దిగుతున్నారు. దీంతో ఏం చేయాలో తెలియక ప్రజాప్రతినిధులు తిరుగుముఖం పడుతున్నారు. 
 
తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో తెరాస 88 సీట్లలో గెలుపొందగా, టీడీపీ 2 స్థానాల్లో, కాంగ్రెస్ 19 చోట్ల గెలుపొందింది. అయితే, టీడీపీ తరపున గెలిచి ఇద్దరూ కారెక్కేశారు. ఇపుడు కాంగ్రెస్ పార్టీకి చెందిన 19 మంది ఎమ్మెల్యేల్లో 10 మంది గులాబీ కండువా కప్పుకున్నారు. మిగిలిన వారిని కూడా పార్టీలో చేర్చుకుని సీఎల్పీని తెరాసలో విలీనం చేయాలన్న పట్టుదలతో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు. 
 
ఈ నేపథ్యంలో గులాబీ గూటికి చేరుతున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు కొత్త కష్టాలొచ్చిపడ్డాయి. పార్టీ ఎందుకు మారారన్న ప్రశ్నలు ప్రజల నుంచి ఎదురవుతున్నాయి. వారి ప్రశ్నలకు సమాధానం చెప్పలేకపోతున్న ఎమ్మెల్యేలపై ప్రజలు దాడులకు దిగుతున్నారు. దీంతో అటు పూర్తి స్థాయిలో టీఆర్ఎస్‌లోకి వెళ్లలేక, ఇటు తమను గెలిపించిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు సర్ధిచెప్పుకోలేక సతమతమవుతున్నారు. 
 
గులాబీ గూటికి చేరిన ఎమ్మెల్యేలను నిలదీయాలంటూ కాంగ్రెస్ హైకమాండ్ పిలుపునిచ్చింది. మరోవైపు పార్టీ మారిన ఎమ్మెల్యేలను నిలదీయాలని పార్టీ శ్రేణులు నిర్ణయించారు. దీంతో ఎక్కడికక్కడే వారిని జనం నిలదీస్తున్నారు. తాజాగా ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం గోవింద్రాలలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారానికి వెళ్లిన ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్‌పై గ్రామస్తులు దాడికి దిగారు. పార్టీ మారడంపై గ్రామస్తులు పెద్దఎత్తున నిరసనలు తెలియజేశారు. ఎన్నికలకు ముందు ప్రాణం పోయినా పార్టీ మారనని ఇచ్చిన హామీ ఏమైందని ఆమెను నిలదీశారు. 
 
అలాగే, పినపాక ఎమ్మెల్యే రేగ కాంతారావుకు కూడా ప్రజల నుంచి నిరసన సెగ ఎదురైంది. బూర్గంపహాడ్ మండలంలోని రెడ్డిగూడెం గ్రామానికి స్థానిక ఎన్నికల ప్రచారానికి వెళ్లిన కాంతారావును పార్టీ ఎందుకు మారాల్సి వచ్చిందని జనం నిలదీశారు. దీంతో ఎమ్మెల్యేకు, గ్రామస్తులకు మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో ఆయన ప్రచారాన్ని మధ్యలోనే నిలిపివేశారు.

ఇలా పార్టీ ఫిరాయింపుదారులకు గ్రామాల్లో చేదు అనుభవం ఎదురవడంతో ప్రచారానికి వెళ్లాంటే భయపడిపోతున్నారు. అలాగే, పార్టీ మారిన ఎమ్మెల్యేలపై తగిన చర్యలు ఉంటాయని హైకోర్టు కూడా ఇటీవల హెచ్చరికలు చేసింది. మరి ఈ జంపింగ్ జిలానీల భవిష్యత్ ఏ విధంగా ఉంటుందో చూడాలి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రష్యా విమానంపై పిడుగు పడటం వల్లే ప్రమాదం