Publish Date: Tue, 14 May 2024 (18:42 IST)
Updated Date: Tue, 14 May 2024 (21:26 IST)
గత అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంకా హ్యాంగోవర్లో ఉన్నట్లు కనిపిస్తోంది. రేవంత్ని కాంగ్రెస్ నుంచి గెంటేయడానికి ఆరు నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా వుందని కామెంట్లు చేస్తున్న కేసీఆర్ ప్రస్తుతం తనను తాను ప్రధానమంత్రి అభ్యర్థిగా ప్రకటించుకున్నారు.
మీడియాను ఉద్దేశించి కేసీఆర్ మాట్లాడుతూ "నేను ప్రధాని రేసులో ఎందుకు ఉండను? అవకాశం వస్తే దాన్ని స్వీకరించడానికి నేను సంతోషిస్తాను. ఆ అవకాశాన్ని ఎవరు ఉపయోగించుకోరు." అని కేసీఆర్ అన్నారు. తనకు ఇంకా జాతీయ రాజకీయాల కలలు ఉన్నాయని, తనకు వచ్చిన ఏ అవకాశాన్ని అందిపుచ్చుకుంటానని మాజీ సీఎం వ్యాఖ్యానించారు.
కేసీఆర్ విశ్వాసాన్ని, ఉద్దేశాన్ని బీఆర్ఎస్ మద్దతుదారులు స్వాగతిస్తున్నారు. విపక్షాలు మాత్రం ఎన్నికల్లో ఓడినా.., ఎంపీ ఎన్నికల్లో కూడా పోటీ చేయని తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడంలో కేసీఆర్ తెగువ ఏంటని ప్రశ్నిస్తున్నారు.
మొత్తంగా బీఆర్ఎస్ పార్టీ 1-2 సీట్లకు మించి గెలువదని పలు సర్వేలు చెబుతున్న తరుణంలో కేసీఆర్ తనను తాను ప్రధాని అభ్యర్థిగా ప్రకటించుకోవడంపై సర్వత్రా చర్చ సాగుతోంది.