ఫేస్బుక్లో పరిచయమైన ఓ యువతిని స్నేహం పేరుతో దరి చేర్చుకున్నాడు. ఆ తర్వాత భోజనానికి ఇంటికి పిలిచి లైంగితదాడికి పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటన హైదరాబాద్ నగరంలోని బంజారాహిల్స్లో వెలుగు చూసింది. ఈ వివరాలను పరిశీలిస్తే,
బంజారాహిల్స్లో ఉంటున్న 24 యేళ్ళ యువతికి 2023లో ఫిబ్రవరి నెలలో ముఖపుస్తకం ద్వారా మహేంద్రవర్ధన్ అనే వ్యక్తి పరిచయమయ్యాడు. తాను ఉస్మానియా వర్శిటీలో పని చేస్తున్నట్టు చెప్పుకున్నాడు. ఆ తర్వాత వారిద్దరి మధ్య కొన్నాళ్లపాటు ఫోనులో మాటలు నడిచాయి. ఓ రోజు కాఫీషాపుకు రమ్మని పిలిస్తే ఆమె వెళ్లింది.
ఆ తర్వాత అదే యేడాది ఆగస్టు 15వ తేదీన ఇంటికి ఇంటికి భోజనానికి పిలిచాడు. అతని మాటలు నమ్మిన బాధితురాలు వెళ్ళింది. ఇంటికొచ్చిన ఆమెను మాటల్లో పెట్టి మత్తుమందు కలిగిన శీతలపానీయం ఇచ్చాడు. అది తాగిన బాధితురాలు మగతలోకి జారుకుంది. ఆ తర్వాత ఆమెపై అత్యాచారనికి పాల్పడ్డాడు. ఈ దారుణాన్ని ఫోటోలు, వీడియోలో తీశాడు.
మరుసటి రోజు ఆమెకు వీడియోలు, ఫోటోలు చూపించి రూ.20 లక్షల ఇవ్వాలని డిమాండ్ చేశాడు. ఇవ్వకపోతే వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానని బెదిరించాడు. దీంతో భయాందోళనకు గురైన బాధితురాలు రూ.20 లక్షలు అతని చేతిలో పెట్టింది. ఇదే అదునుగా భావించిన నిందతుడు మరో దఫాలో రూ.కోటి ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వేధించసాగాడు. దీంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.