కట్టుకున్న భర్తతో గొడవలతో విసుగెత్తిన ఓ మహిళ తన ముగ్గురు పిల్లలతో కలిసి కాలువలో దూకి ఆత్మహత్య చేసుకుంది. ఈ విషాదకర ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని బండా జిల్లాలోని రిసౌరా గ్రామంలో చోటుచేసుకుంది. పోలీసులు వెల్లడించిన వివరాల మేరకు... రిసౌరా గ్రామానికి చెందిన రీనా, అఖిలేశ్ అనే దంపతులుకు ముగ్గురు పిల్లలు ఉన్నారు. శుక్రవారం రాత్రి భర్తతో గొడవ జరగడంతో పిల్లలను తీసుకుని ఇల్లు వదిలి వెళ్లిపోయింది. ఉదయం లేచి చూడగా కోడలు, పిల్లలు కనిపించలేదు.
దీంతో అత్తామామలు, ఇరుగు పొరుగువారు కలిసి వారి కోసం గాలించగా, ఊరికి శివారులో ఉన్న కెన్ కాలువ వద్ద దుస్తులు, గాజులు, చెప్పులు కనిపించాయి. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసులకు సమాచారం చేరవేశారు. వారు గజ ఈతగాళ్ళతో వచ్చి కాలువలో గాలించగా మూడు మృతదేహాలను వెలికి తీశారు. మృతులను రీనా (30), హిమాన్షు (9), అన్షి (5), ప్రిన్స్ (3) అనేవారిగా గుర్తించారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.