Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Wednesday, 9 April 2025
webdunia

ప్రియురాలితో కలిసి ఆమె భర్తను హత్య చేసిన ఉపాధ్యాయుడు!!

Advertiesment
murder

ఠాగూర్

, శుక్రవారం, 4 ఏప్రియల్ 2025 (08:58 IST)
కొంతకాలంగా తాను వివాహేతర సంబంధం పెట్టుకున్న తన ప్రియురాలితో కలిసి ఆమె భర్తనే ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు హత్య చేశాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని మహబూబాబాద్‌లో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చిన వివరాల మేరకు.. దంతాలపల్లిలోన జ్యోతిబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో హెల్త్ సూపర్ వైజర్‌గా పార్థసారథి అనే వ్యక్తి పనిచేస్తున్నారు. ఈయన తన భార్య స్వప్నతో కలిసి కొత్తగూడెంలో ఉంటున్నారు. 
 
అయితే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం నెల్లిపాక గ్రామానికి చెందిన ఉపాధ్యాయుడు సొర్లాం విద్యాసాగర్‌తో స్వప్నకు 2016లో పరిచయం ఏర్పడింది. ఇది కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసిన పార్థసారథి పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ నిర్వహించినా వారిద్దరిలో మార్పురాలేదు. 
 
దీంతో భార్యాభర్తల మధ్య తరచుగా గొడవలు జరుగుతూ ఉండేవి. దీంతో స్వప్న, విద్యా సాగర్‌లు కలిసి పార్థసారథి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్ వేశారు. ఈ మేరకు నెల రోజుల క్రితం కొత్తగూడెం పట్టణానికి చెందిన వినయ్ కుమార్, శివశంకర్, వంశీ, లవరాజులతో రూ.5 లక్షలకు సుపారీ ఇచ్చి పార్థసారథిని హత్య చేసేలా మాట్లాడుకున్నారు. 
 
మార్చి 28వ తేదీన పండగ సెలవులకు భద్రాచలం వచ్చిన పార్థసారథి తిరిగి 31వ తేదీన విధుల్లో చేరేందుకు ఊరికి బయలుదేరాడు. ఈ విషయాన్ని తన ప్రియురాలి ద్వారా తెలుసుకున్న విద్యాసాగర్.. పార్థసారథిని హతమార్చేందుకు ఇదేసరైన సమయమని భావించి, సుపారీ ముఠాకు ఓ వాహనం ఇచ్చి పంపించాడు. 
 
మహబూబాబాద్ దాటిన తర్వాత పార్థసారథిని వెంటాడిన సుపారీ గ్యాంగ్ శనిగపురం శివారు బోరింగ్ తండా సమీపంలో అడ్డగించి ఇనుపరాడ్లతో దాడి చేసి హత్య చేశారు. పార్థసారథి సోదరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. విద్యాసాగర్, స్వప్నలను అరెస్టు చేయగా, సుపారీ ముఠా సభ్యులు మాత్రం పరారీలో ఉన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సిల్వర్ జూబ్లీ వివాహ వేడుకలు : భార్యతో కలిసి డ్యాన్స్ చేస్తూ కుప్పకూలి భర్త మృతి (Video)