తనకు పరిచయం ఉన్న ఓ మహిళకు మాయమాటలు చెప్పి కారులో ఎక్కించుకున్న ఓ ఆర్ఎంపీ వైద్యుడు ఆమెకు మత్తు మందు ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ తర్వాత ఆమెను అంతమొందించేందుకు ప్రయత్నించాడు. ఈ దారుణం తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లా గుర్రంపోడు మండలంలో చోటు చేసుకుంది. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ఆర్ఎంపీ వైద్యుడు మహేశ్.. గుర్రంపోడు మండలం జూనూతుల గ్రామంలో గత ఆరేళ్లుగా ఆసుపత్రి నిర్వహిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన వివాహిత(35) మిర్యాలగూడలో భర్త, పిల్లలతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం స్వగ్రామం వెళ్లే నిమిత్తం ఆమె మిర్యాలగూడలో బస్సెక్కి మల్లేపల్లికి వచ్చారు. జూనూతుల వెళ్లే బస్సు కోసం అక్కడి బస్టాపులో ఎదురు చూస్తున్నారు.
ఇంతలో అక్కడకు కారులో వచ్చిన మహేశ్.. పూర్వపరిచయం ఉన్న ఆమెతో మాట కలిపాడు. తాను కూడా జూనూతుల వెళ్తున్నానని చెప్పి కారులో ఎక్కించుకున్నాడు. మార్గమధ్యలో ఆమెకు మత్తు మందు కలిపిన శీతలపానీయం ఇచ్చాడు.
అది సేవించిన ఆమె మత్తులోకి జారుకోగానే అత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం కారును నల్గొండకు తీసుకెళ్లాడు. రాత్రి 12 గంటల వరకూ అక్కడే ఉన్నాడు. తర్వాత జూనూతుల తిరుగుప్రయాణమయ్యాడు. ఆ సమయంలో ఆమెను హతమార్చే ఉద్దేశంతో రెండు చేతులకు గడ్డి మందు ఇంజెక్షన్ చేశాడు.
ఈ క్రమంలో గుర్రంపోడులో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న పోలీసులు అర్థరాత్రి దేవరకొండ వైపు వెళ్తున్న కారును గమనించారు. గొర్రెల దొంగలై ఉండొచ్చనే అనుమానంతో వెంబడించారు. జూనూతులు స్టేజీ దాటిన తర్వాత కాచారం స్టేజీ వైపు మలుపు తిరిగిన తర్వాత కారు డ్రైవర్ లైట్లు ఆర్పివేసినట్టు గమనించిన పోలీసులు.. అటు వైపు వెళ్లారు. అక్కడ ఓ వ్యక్తి కారులో నుంచి ఓ మహిళను కిందకు తోసేసినట్టు గుర్తించారు.
అప్పటికే ఆ మహిళ నోటివెంట నురగలు వస్తుండటంతో హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. మహేశ్ను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు విడిచింది. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మహేశ్ను అరెస్టు చేసి విచారిస్తున్నారు.