కడప జిల్లా ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటీ క్యాంపస్ మరోసారి వార్తల్లోకెక్కింది. ఈ క్యాంపస్లో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాత్రూమ్లోని కిటికీకి ఓ విద్యార్థి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకుంది. ఈ ఘటనతో క్యాంపస్లో విషాదం నెలకొంది.
వివరాలను పరిశీలిస్తే, ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ ప్రాంగణంలోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ-2 చదువుతున్న విద్యార్థి నరసింహనాయుడు గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల మండలం ఫరీద్ పేటకు చెందిన ఈ విద్యార్థి సెల్ఫోన్కు బానిస కావడం, తండ్రి ఇదివరకే మరణించి ఉండటం వంటి కారణాల వల్ల బాత్రూమ్లోని కిటికీకి ఉరివేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. విద్యార్థి మృతదేహాన్ని వేంపల్లి 50 పడకల ఆస్పత్రికి తరలించారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా విద్యార్థి తల్లికి సమాచారం అందించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.
ఈ క్యాంపస్లో విద్యార్థులు ఆత్మహత్య చేసుకోవడం ఇది మొదటిసారికాదు. గత యేడాది అంతకుముందు కూడా వివిధ కారణాలతో విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. తాజాగా విద్యార్థి ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు ఇతర వివరాలు ఇంకా తెలియాల్సివుంది. ఇది వరకు కూడా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ పలుమార్లు వార్తల్లో నిలిచింది. గత యేడాది భద్రతా సిబ్బంది తనిఖీల్లో ఇద్దరు విద్యార్థుల వద్ద గంజాయి, సిగరెట్ ప్యాకెట్లు దొరగడం తీవ్ర సంచలనం కలిగించింది.