ఇండోర్: ఇండోర్కు చెందిన కొత్తగా పెళ్లైన దంపతులు రాజా రఘువంశీ, సోనమ్ రఘువంశీ తమ హనీమూన్ జరుపుకోవడానికి మేఘాలయలోని షిల్లాంగ్కు వెళ్లారు. అక్కడికి చేరుకున్న 3 రోజుల తర్వాత ఆ జంట అదృశ్యమయ్యారు. 11 రోజుల పాటుగా తీవ్రంగా గాలించిన తర్వాత, రాజా రఘువంశీ మృతదేహం షిల్లాంగ్ లోయలో లభ్యమైంది. కానీ అతడి భార్య సోనమ్ జాడ కనిపించలేదు. ఐతే హనీమూన్ సమయంలో, సోనమ్ తన అత్తగారితో ఫోన్లో మాట్లాడింది. ఈ సంభాషణ తర్వాత, ఆ జంట అదృశ్యమయ్యారు. ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ రికార్డింగ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇండోర్లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలో నివసించే రవాణా వ్యాపారవేత్త రాజా రఘువంశీ తన భార్య సోనమ్ రఘువంశీతో కలిసి హనీమూన్ జరుపుకోవడానికి షిల్లాంగ్కు వెళ్లారు. ఇద్దరూ షిల్లాంగ్లోని ఓయిరా హిల్స్ ప్రాంతం నుండి అదృశ్యమయ్యారు. షిల్లాంగ్ పోలీసులు గత 11 రోజులుగా వారి కోసం వెతుకుతున్నారు. ఈ క్రమంలో రాజా రఘువంశీ మృతదేహాన్ని లోతైన గుంటలో పోలీసులు కనుగొన్నారు. భార్య సోనమ్ కోసం షిల్లాంగ్ పోలీసులు ఇంకా వెతుకుతున్నారు. కనిపించకుండా పోయే ముందు సోనమ్ రఘువంశీ తన అత్తగారు ఉమా రఘువంశీతో ఫోన్లో మాట్లాడింది.
ఈ చివరి సంభాషణలో అత్తగారు తన కోడలితో ఎలా వున్నావంటూ ప్రశ్నించింది. నువ్వూ, నా కొడుకు ఇద్దరూ ఏమీ తినకుండా ఎందుకు వున్నారు, ఏదైనా దొరికితే తినండి అంటూ చెప్పింది. దానికి కోడలు సోనమ్ మాట్లాడుతూ... ఇక్కడ తినడానికి, త్రాగడానికి మంచిగా ఏమీ దొరకదు. నేను ఒక చోట కాఫీ తాగాను, అది కూడా బాగోలేదు, దీని గురించి నీ కొడుకు అతడితో కాసేపు వాదించాడు. మేము తాగిన కాఫీ ఏమీ బాగోలేదు అని చెప్పింది. దానికి ఆమె అత్త... ఇప్పుడు మీ ఇద్దరు ఎక్కడున్నారని అడిగింది.
ఆయన నన్ను అడవికి నడకకు తీసుకొచ్చారు. ఇది చాలా నిటారుగా వున్న కొండ ప్రాంతం... పైకి ఎక్కడం కష్టంగా వుంది అని చెప్పింది. దాంతో సోనమ్ అత్త మాట్లాడుతూ.. అలాంటి ప్రదేశంలో నువ్వు అక్కడ ఏమి చూడటానికి వెళ్ళావు? కింద నుండి చూసి ఉండవచ్చు" అని అన్నారు. దీనికి సోనమ్, "మేము జలపాతం చూడటానికి వెళ్ళాము" అని చెప్పింది. సోనమ్ తన అత్త ఉమాతో మాట్లాడినప్పుడు ఇదే చివరి కాల్. ఈ సంభాషణ తర్వాత ఆ జంట అదృశ్యమయ్యారు. ఐతే భర్తను హత్య చేసారు. భార్య ఆచూకి ఇంకా కనుగొనలేదు. దీని వెనుక వున్న అసలు కారణం ఏంటన్న విషయాన్ని ఛేదించే పనిలో పోలీసులు వున్నారు.