Publish Date: Thu, 30 May 2024 (10:16 IST)
Updated Date: Thu, 30 May 2024 (10:17 IST)
ప్రేమించమని వెంటపడ్డాడు. నువ్వే నా ప్రాణమని, నువ్వు లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ప్రాధేయపడ్డడు. ఇదంతా నిజమని నమ్మా. కానీ అమ్మా-నాన్న మాట వింటే ఈరోజు సంతోషంగా ఉండేది అని ఓ యువతి 14 పేజీల లేఖ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. జీడిమెట్ల ఎస్ఐ ముంత అంజనేయులు తెలిపిన వివరాల మేరకు.. ఠాణా పరిధిలోని ఎన్ఎల్బీ నగర్లో నివాసముండే బాలబోయిన అఖిల(22) ఓ ప్రైవేటు ఉద్యోగం చేసేవారు. షాపూర్నగర్కి చెందిన అఖిల్ సాయిగౌడ్ గత కొన్నెళ్లుగా ప్రేమ పేరుతో అఖిలను వేధించేవాడు.
ఆమె ఒప్పుకునే వరకు వెంటపడ్డాడు. ఈ విషయం యువతి కుటుంబ సభ్యులకు తెలియడంతో బంధువుల సమక్షంలో అతనిని పిలిపించి మాట్లాడారు. పెళ్లి చేసుకుంటానని హామీ ఇవ్వడంతో అతని ప్రేమను ఒప్పుకున్నారు. కొన్నేళ్ల పాటు ప్రేమాయణం సాఫీగా సాగింది. గత మూడు, నాలుగు నెలల నుంచి వేధింపులు ఎక్కువయ్యాయి. చిన్నచిన్న విషయాలకు రోడ్డుపైనే అఖిలను కొడుతుండేవాడు. దీనికితోడు అతను పెళ్లికి నిరాకరించడంతో తన కుమార్తె మంగళవారం 14 పేజీల లేఖ రాసి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు తండ్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.