హైదరాబాద్ ఎల్పీ నగర్లో ఓ విషాదకర ఘటన జరుగుతోంది. ఓ తల్లి బలవన్మరణానికి పాల్పడింది. పెద్ద కుమారుడుని బజారుకు పంపించి.. చిన్న కుమారుడు కళ్లెదుటే సీలింగ్ ఫ్యానుకు ఉరేసుకుంది. కన్నతల్లి ఉరితాడుకు వేలాడుతున్నప్పటికీ అనారోగ్యంతో బాధపడుతున్న చిన్న కుమారుడు ఆమెను రక్షించుకోలేక నిస్సహాయంగా రోదించాడు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే,
ప్రకాశం జిల్లా కందుకూరుకు చెందిన సుధ (42), నర్సింహా దంపతులు బతుకుదెరువు కోసం 15 యేళ్ల క్రితం హైదరాబాద్ నగరానికి వచ్చారు. గత నాలుగేళ్లుగా వనస్థలిపురం సమీపంలోని మారుతి నగర్లో ఓ పెంట్ హౌస్ను అద్దెకు తీసుకుని ఉంటున్నారు. ఈ దంపతులకు 18, 13 యేళ్లలో ఇద్దరు కుమారులు ఉన్నారు. చిన్న కుమారుడు బాల్యం నుంచే మధుమేహంతో బాధపడుతున్నాడు.
భర్త నర్సింహా మాత్రం భవన నిర్మాణ కార్మికుడుగా ఉంటూ మద్యానికి బానిసయ్యాడు. దీంతో సుధ ఇళ్లలో పని చేస్తూ కుటుంబాన్ని పోషిస్తోంది. డబ్బులేక చిన్న కుమారుడుకి వైద్యం చేయించలేకపోతున్నానంటూ సుధ తరచూ పక్కింటికి వెళ్లి వాపోయేది. అదేసమయంలో తన పెద్ద కుమారుడు పక్కింటిలో ఇనుపరాడ్డును చోరీ చేయడంతో ఆ ఇంటి యజమాని మందలించాడు.
ఈ గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన సుధ మంగళవారం రాత్రి పెద్ద కుమారుడుని బజారుకు పంపించింది. ఇంట్లో ఉన్న చిన్న కుమారుడు చూస్తుండగానే సీలింగ్ ఫ్యానుకు చీరతో ఉరేసుకుంది. అనారోగ్యంతో బాధపడుతున్న బాలుడు తల్లిని కాపాడుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. ఈలోగు బాజరు నుంచి తిరిగి వచ్చిన పెద్ద కుమారుడు చుట్టుపక్కల వారిని పిలిచి తల్లిని కిందకు దింపి వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె ప్రాణాలు కోల్పోయిందని వైద్యులు చెప్పారు. స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.