Publish Date: Mon, 08 Dec 2025 (14:48 IST)
Updated Date: Mon, 08 Dec 2025 (15:39 IST)
హైదరాబాద్ నగరంలో దారుణం జరిగింది. పట్టపగలు రియల్టర్ను నరికి చంపేశారు. ఆయన ద్విచక్రవాహనంపై వెళుతుండగా కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలో వచ్చి కత్తులతో విచక్షణా రహితంగా నరికేశారు. దీంతో ఆ రియల్టర్ హత్యా స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. మృతుడుని హిస్టరీ షీటర్ వెంకటరత్నంగా గుర్తించారు. పాతకక్షల కారణంగానే ఈ హత్య జరిగినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ దారుణ ఘటన మల్కాజిగిరి సమీపంలోని సాకేతే కాలనీలో ఈ ఘటన చోటుచేసుకుంది.
జవహర్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఫోస్టర్ బిల్బాగ్ స్కూల్ సమీపంలో వెంకటరత్నం అనే రియల్టర్ తన మోటర్ సైకిల్పై పెళుతుండగా, కొందరు దుండగులు ఆటోలో ఆయనను వెంబడించారు. తొలుత వెంకటరత్నంపై కాల్పులు జరిపారు. ఆ తర్వాత కత్తులతో విచక్షణా రహితంగా నరికి చంపేశారు. దీంతో ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. పట్టపగలే జరిగిన ఈ హత్యతో స్థానికులు తీవ్ర భాయాందోళనకు గురయ్యారు.
సమాచారం. అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలంలో ఒక పదునైన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో కేసు నమోదు చేసిన పోలీసులు.. సమీపంలోని సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. మృతుడు వెంకటరత్నం నగరంలోని ధూల్పేట్కు చెందిన షీటర్ అని, గతంలో జరిగిన జంట హత్య కేసుల నిందితుడని పోలీసులు తెలిపారు. ఆ హత్యలకు ప్రతీకారంగానే ఈ దాడి జరిగివుండొచ్చని ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.