ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ టోర్నమెంట్లో భాగంగా, మరికొన్ని గంటల్లో భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరుగనుంది. పాకిస్థాన్ నిర్వహించే ఈ మ్యాచ్కు దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. అయితే, ఈ మ్యాచ్పై భారీ స్థాయిలో బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఈ బెట్టింగ్ దందాకు సంబంధించి ఐదుగురు కీలక బుకీలను అరెస్టు చేశామని వివరించారు. ఇందులో కొందరికి అండర్ వరల్డ్తో సంబంధాలు ఉన్నాయని తెలిపారు. దావూద్ ఇబ్రహీంకు చెందిన అండర్ వరల్డ్ గ్రూప్ డి కంపెనీ కూడా ఇందులో ఇన్వాల్వ్ అయిందని చెప్పారు. ఫైనల్ మ్యాచ్లో భారత్ జట్టే ఫేవరేట్ అని, ఈ మ్యాచ్పై ఏకంగా రూ.5 వేల కోట్లు బెట్టింగ్ జరిగిందని ఢిల్లీ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు వెల్లడించారు.
ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. బెట్టింగ్ దందాలు నిర్వహిస్తున్న ఇద్దరు బుకీలు ప్రవీణ్ కొచ్చర్, సంజయ్ కుమార్ అనే ఇద్దరు బుకీలను స్వయంగా అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్టాప్లు, మొబైల్ ఫోన్లతో పాటు పలు ఎలక్ట్రానిక్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. వారిని విచారించగా ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య జరిగిన సెమీ ఫైనల్ మ్యాచ్పైనా బెట్టింగ్ నిర్వహించినట్టు చెప్పారు. ఈ బెట్టింగ్ దందాను దుబాయ్ నుంచి నిర్వహిస్తున్నారని, ప్రతీ మ్యాచ్కు తమకు రూ.40 వేల చొప్పున కమీషన్ అందుతుందని తెలిపారు. రెండేళ్లుగా ఓ ఇంటిని రూ.30 వేలకు అద్దెకు తీసుకుని ప్రత్యేకంగా ఈ దందాను కొనసాగిస్తున్నట్టు తెలిపారు.