Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఐపీఎల్ 2024 : ఢిల్లీ జట్టు సారథి రిషభ్ పంత్‌పై ఒక మ్యాచ్ సస్పెన్షన్

rishabh panth

ఠాగూర్

, ఆదివారం, 12 మే 2024 (14:11 IST)
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2024 సీజన్ ప్లే ఆఫ్స్ దశకు చేరుకుంది. దీంతో ఈ దశకు అర్హత సాధించే జట్లపై సర్వత్రా ఉత్కంఠత నెలకొంది. ముఖ్యంగా, ప్లై ఆఫ్స్‌కు అర్హత సాధించేందుకు తహతహలాడుతున్న ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు గట్టి షాక్ తగిలింది. డీసీ జట్టు సారథి రిషబ్ పంత్‌పై ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఒక మ్యాచ్ సస్పెన్షన్ వేటు వేసింది.
 
ఈ సీజన్‌లో డీసీ మూడోసారి స్లో ఓవర్ రేటు (మందకొడి బౌలింగ్‌)కు కారణమైనందుకు నిబంధనల ప్రకారం పంత్‌పై ఈ చర్య చేపట్టింది. అలాగే రూ.30 లక్షల జరిమానా విధించింది. ఇంపాక్ట్ ప్లేయర్ సహా జట్టులోని మిగతా సభ్యులకు రూ.12 లక్షల చొప్పున లేదా మ్యాచ్ ఫీజులో 50 శాతంలో ఏది తక్కువైతే దాన్ని ఫైన్ కింద పరిగణిస్తామని గవర్నింగ్ కౌన్సిల్ తెలిపింది.
 
మ్యాచ్ రిఫరీ నిర్ణయాన్ని డీసీ జట్టు వెంటనే బీసీసీఐ అంబుడ్స్ మన్‌లో సవాల్ చేసినా ఫలితం లేకపోయింది. రిఫరీ నిర్ణయాన్ని అంబుడ్స్‌మన్ సమర్థించింది. దీంతో రాయల్ చాలెంజర్స్ బెంగళూరుతో ఆదివారం జరిగే కీలక మ్యాచ్‌కు పంత్ దూరం కానున్నాడు. అతని స్థానంలో అక్షర్ పటేల్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడని జట్టు కోచ్ రికీ పాంటింగ్ తెలిపాడు.
 
గత మంగళవారం రాజస్థాన్ రాయల్స్‌తో మ్యాచ్‌లో డీసీ తొలుత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 221 పరుగులు చేసింది. జేక్ ఫ్రేజర్ మెక్ గర్క్ 20 బంతుల్లో 50 చేయగా అభిషేక్ పోరెల్ 36 బంతుల్లో 63 పరుగులు సాధించాడు. ట్రిస్టన్ స్టబ్స్ 20 బంతుల్లోనే 41 పరుగులు బాదాడు.
 
అనంతరం చేజింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్లను త్వరగానే కోల్పోయింది. కానీ కెప్టెన్ సంజూ శాంసన్ 46 బంతుల్లో 86 నాటౌట్, రియాన్ పరాగ్ 27 పరుగులు, శివం దూబే 12 బంతుల్లో 25 పరుగులతో గెలుపుపై ఆశలు రేపారు. కానీ సంజూ శాంసన్ అవుట్ కావడం మ్యాచ్‌ను అనూహ్యంగా మలుపు తిప్పింది. దీంతో రాజస్థాన్ చివరకు 20 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. రవిచంద్రన్ అశ్విన్ 24 పరుగులకు 3 వికెట్లు తీసుకొని మ్యాచ్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఐపీఎల్ 2024 : ముంబైపై కోల్‌కతా థ్రిల్లింగ్ విక్టరీ