పెర్త్ వేదికగా ఆదివారం జరిగిన తొలి వన్డే మ్యాచ్లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. టీమిండియా బ్యాటర్లు సమిష్టిగా చేతులెత్తేయడంతో భారత జట్టుకు ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు ఏకంగా ఏడు వికెట్లు తేడాతో విజయభేరీ మోగించింది. ఈ మ్యాచ్కు వరుణుడు పలుమార్లు ఆటంకం కలిగించడంతో ఆటను 26 ఓవర్లకు కుదించారు.
ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 136 పరుగులు చేసింది. డక్వర్త్ లూయిస్ ప్రకారం ఆస్ట్రేలియాకు 131 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా.. 21.1 ఓవర్లలోనే 3 వికెట్లు కోల్పోయి ఛేదించింది. కెప్టెన్ మిచెల్ మార్ష్ 52 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్స్ల సాయంతో 46, జోష్ ఫిలిప్ 29 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 37, రెన్ షా 21 చొప్పున పరుగులు చేసిన నాటౌట్గా నిలిచాడు. ట్రావిస్ హెడ్ (8)ని అర్ష్దీప్ వెనక్కి పంపగా.. మాథ్యూ షార్ట్ (8)ని అక్షర్ ఔట్ చేశాడు. సుందర్ బౌలింగ్లో ఫిలిప్ పెవిలియన్ చేరాడు. రెండో వన్డే గురువారం జరగనుంది.
మరోవైపు, ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత జట్టు బ్యాటర్లలో కేఎల్ రాహుల్ 31 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్ల 38 పరుగులుచేసి జట్టులోని మిగిలిన ఆటగాళ్లలో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఆ తర్వాత అక్షర్ పటేల్ 31 పరుగులు చేసి ఫర్వాలేదనిపించాడు. మాజీ కెప్టెన్లు విరాట్ కోహ్లీ డకౌట్ కాగా.. రోహిత్ శర్మ ఎనిమిది పరుగులు, ప్రస్తుత సారథి శుభమన్ గిల్ పది, శ్రేయాస్ అయ్యర్ 11, వాషింగ్టన్ సుందర్ 10, నితీశ్ రెడ్డి 19 (నాటౌట్) చొప్పున పరుగులు చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లలో హేజిల్వుడ్, మిచెల్ ఓవెన్, కునెమన్ రెండేసి వికెట్లు పడగొట్టగా.. మిచెల్ స్టార్క్, నాథన్ ఎలిస్కు చెరో వికెట్ దక్కింది. కాగా, 2026 సంవత్సరంలో భారత జట్టు ఖాతాలో తొలి వన్డే మ్యాచ్ ఓటమి ఎదురైంది. వరుసగా ఎనిమిది విజయాల తర్వాత టీమ్ఇండియా పరాజయం చవిచూసింది.