దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్, బంగ్లాదేశ్ మధ్య జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్లో అనేక రికార్డులు తిరగరాయబడ్డాయి. భారత్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, టోర్నమెంట్కు అద్భుతమైన ఆరంభాన్ని ఇచ్చింది భారత్. ఇందులో
భారత స్టార్ పేసర్ మహ్మద్ షమీ ఐదు వికెట్లు తీసి సంచలనాత్మక రికార్డును సృష్టించాడు. వన్డే ఇంటర్నేషనల్స్లో (ODIs) ఆల్ టైమ్ రికార్డును బద్దలు కొట్టాడు. వన్డేల్లో అత్యంత వేగంగా 200 వికెట్లు తీసిన బౌలర్గా అతను రికార్డు సృష్టించాడు. ఈ ఘనత సాధించిన బంతుల సంఖ్య పరంగా ఆస్ట్రేలియా సూపర్స్టార్ మిచెల్ స్టార్క్ను అధిగమించాడు.
ఈ మైలురాయిని చేరుకోవడానికి షమీ స్టార్క్ కంటే రెండు ఇన్నింగ్స్లు ఎక్కువగా తీసుకున్నప్పటికీ, అతను దానిని తక్కువ బంతుల్లోనే సాధించాడు. షమీ 104 మ్యాచ్ల్లో 5,126 బంతుల్లో 200 వికెట్లు సాధించగా, స్టార్క్ 102 ఇన్నింగ్స్ల్లో 5,240 బంతులు తీసుకున్నాడు. దీంతో, 200 వన్డే వికెట్లు పడగొట్టడానికి అతి తక్కువ బంతులు తీసుకున్న ఆటగాడిగా షమీ రికార్డు సృష్టించాడు.
అంతేకాకుండా, భారత మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ పేరిట ఉన్న రికార్డును కూడా షమీ బద్దలు కొట్టాడు. అగార్కర్ 200 వికెట్లు సాధించడానికి 133 మ్యాచ్లు తీసుకోగా, షమీ కేవలం 104 మ్యాచ్ల్లోనే ఈ ఘనత సాధించాడు.