ఈ నెల 19వ తేదీ నుంచి పాకిస్తాన్ వేదికగా ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ 2025 టోర్నీ ప్రారంభంకానుంది. ఇందులోపాల్గొనే జట్లు కొత్త జెర్సీలను ధరించాల్సివుంది. భారత క్రికెట్ జట్టు కూడా ఈ కొత్త జెర్సీలనే ధరించాలి. అయితే, భారత జట్టు జెర్సీపై భారత పేరును ముద్రించారు. ఈ జెర్సీలను భారత జట్టు సోమవారం ఆవిష్కరించింది. కెప్టెన్ రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, హార్దిక్ పాండ్యా, అర్షదీప్ సింగ్లు కొత్త జెర్సీలు ధరించి కెమెరాలకు ఫోజులిచ్చారు. ఈ జెర్సీలపై ఆతిథ్య పాకిస్థాన్ పేరు ముద్రించడం అందరినీ ఆకర్షించింది. ఈ కొత్త జెర్సీతో ఐసీసీ అవార్డులు అందుకున్న ఆటగాళ్ల ఫోటోలను ఐసీసీ పంచుకుంది. జెర్సీపై 'చాంపియన్స్ ట్రోఫీ 2025, పాకిస్తాన్' అని ముద్రించింది.
సాధారణంగా అతిథ్య దేశం పేరును టోర్నీలో ఆడే జట్ల కిట్లపై ముద్రించడం ఆనవాయితీ. అయితే, భారత జెర్సీపై పాకిస్థాన్ పేరును ముద్రించేందుకు బీసీసీఐ అంగీకరించకపోవడంతో వివాదం మొదలైంది. తాము పాకిస్థాన్లో ఆడటం లేదు కాబట్టి పాక్ పేరును ముద్రించాల్సిన అవసరం లేదని బీసీసీఐ వాదించింది.
అయితే, ఐసీసీ జోక్యంతో ఈ వివాదం సద్దుమణిగింది. ఐసీసీ నిబంధనలకు కట్టుబడి ఉంటామని బీసీసీఐ కార్యదర్శి దేవజిత్ సైకియా వెల్లడించారు. భారత జెర్సీపై పాక్ పేరు ముద్రించడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి కావడం గమనార్హం. 2023లో పాకిస్థాన్లో జరిగిన ఆసియా కప్ సమయంలోనూ ఏ జట్టు తమ జెర్సీపై పాక్ పేరును ముద్రించలేదు.