వన్డే ప్రపంచ కప్ గెలిచినందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ.51 కోట్ల బహుమతిని అందజేస్తుందని కార్యదర్శి దేవజిత్ సైకియా సోమవారం ప్రకటించారు. హర్మన్ప్రీత్ కౌర్ నాయకత్వంలోని భారత మహిళా జట్టు ఆదివారం జరిగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను 52 పరుగుల తేడాతో ఓడించి తమ తొలి ప్రపంచ ట్రోఫీని గెలుచుకుంది.
ప్రపంచ కప్ గెలిచినందుకు భారత మహిళా క్రికెట్ జట్టుకు బీసీసీఐ రూ.51 కోట్ల నగదు బహుమతిని అందజేస్తుంది. ఇందులో అన్ని క్రీడాకారులు, సహాయక సిబ్బంది, జాతీయ ఎంపిక కమిటీ ఉన్నారని సైకియా సోమవారం తెలిపారు. ఆదివారం జరిగిన ఫైనల్లో సమష్టిగా రాణించిన భారత్ 52 పరుగుల తేడాతో సౌతాఫ్రికాను ఓడించిన సంగతి తెలిసిందే. 47 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ హర్మన్ సేన్ తొలి ప్రపంచకప్ను ముద్దాడింది.
ఇక షెఫాలీ వర్మ వరల్డ్ కప్ ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకోవడం ద్వారా ప్రపంచ రికార్డును నెలకొల్పింది. పురుషుల, మహిళల క్రికెట్ వరల్డ్ కప్ చరిత్రలో ఫైనల్ లేదా సెమీ-ఫైనల్లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు గెలుచుకున్న అతి పిన్న వయస్కురాలైన క్రీడాకారిణిగా షెఫాలీ నిలిచింది.
ఆమె ఈ ఘనత సాధించే నాటికి ఆమె వయస్సు కేవలం 21 సంవత్సరాల, 279 రోజులు. అంతేకాకుండా ఆమె వన్డే వరల్డ్ కప్ ఫైనల్లో అర్ధ సెంచరీ (50+), రెండు లేదా అంతకంటే ఎక్కువ వికెట్లు తీసిన ప్రపంచంలోనే మొట్టమొదటి క్రికెటర్ కావడం గమనార్హం.