మెల్బోర్నే వేదికగా శుక్రవారం జరిగిన రెండో టీ20 మ్యాచ్లో భారత్ చిత్తుగా ఓడిపోయింది. ఈ మ్యాచ్లో టీమిండియా ఆటగాళ్లు సమిష్టగా విఫలం కావడంతో జట్టుకు ఓటమి తప్పలేదు. ఫలితంగా ఆతిథ్య ఆస్ట్రేలియా జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయం సాధించింది.
తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 18.4 ఓవర్లలో 125 పరుగులు చేసింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా జట్టు 13.2 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 126 పరుగులు చేసింది. 126 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ఆస్ట్రేలియా ఆది నుంచి దూకుడుగా ఆడింది.
ఆసీస్ ఓపెనర్లలో మిచెల్ మార్ష్ 26 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్ల సాయంతో 46 పరుగులతో రాణించాడు. అతడు ఔట్ కావడానికి ముందు రెండు ఫోర్లు, రెండు సిక్స్లతో విరుచుకుపడ్డాడు. 7.6 ఓవర్లో కుల్దీప్ బౌలింగ్లో అభిషేక్ శర్మకు క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. మరో ఓపెనర్ ట్రావిస్ హెడ్ 15 బంతుల్లో ఒక సిక్స్ సాయంతో 28 పరుగులు చేశాడు. ట్రావిడ్ హెడ్ క్రీజులో ఉన్నంత వరకు దూకుడుగానే ఆడాడు. జోస్ ఇంగ్లిస్ 20 బంతుల్లో 20 రన్స్ చేశాడు.
ఇకపోతే, భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, బుమ్రా తలో రెండు వికెట్లు తీసుకున్నారు. బ్యాటింగ్లో రాణించిన హర్షిత్ రాణా.. బౌలింగ్లో మాత్రం ప్రభావం చూపించలేకపోయాడు. మ్యాచ్ ఆఖరులో భారత బౌలర్లు వెంట వెంటనే వికెట్లు తీసుకున్నప్పటికీ ఆసీస్ను మాత్రం నిలువరించలేకపోయారు. ఫలితంగా ఆ జట్టు నాలుగు వికెట్ల తేడాతో విజయభేరీ మోగించింది.