Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కరోనా కట్టడికి ఏకైక ఆయుధం లాక్‌డౌన్.. అందుకే మే 29 వరకు.. సీఎం కేసీఆర్

కరోనా కట్టడికి ఏకైక ఆయుధం లాక్‌డౌన్.. అందుకే మే 29 వరకు.. సీఎం కేసీఆర్
, బుధవారం, 6 మే 2020 (07:55 IST)
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఏకైక ఆయుధం లాక్‌డౌన్ అని, అందుకే ఈ లాక్‌డౌన్‌ను మే 29వ తేదీ వరకు పొడగిస్తున్నట్టు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు. కేంద్రం ప్రకటించిన లాక్‌డౌన్ మే 17వ తేదీతో ముగియనుంది. కానీ, తెలంగాణ రాష్ట్రం మాత్రం దీన్ని మే 29వ తేదీ వరకు పొడగించింది. ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ అధికారికంగా వెల్లడించారు. 
 
ఇదే అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకున్న చర్యల కారణంగా కరోనా వైరస్‌ వ్యాప్తికి అడ్డుకట్ట వేసి, దాదాపుగా విజయం సాధించినట్టు చెప్పారు. అయితే, కరోనా చివరి లింకును తెంచేవరకు విశ్రమించరాదన్న నిర్ణయంతో ఈ లాక్‌డౌన్‌ను మరోమారు పొడగిస్తున్నట్టు చెప్పారు. దీనివల్ల ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ప్రజలు మరికొన్ని రోజులు భరిస్తూ, ప్రభుత్వానికి సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 
 
కరోనా వైరస్ వ్యాప్తి కట్టడి కోసం మన చేతిలో ఉన్న ఒకే ఒక ఆయుధం లాక్‌డౌన్. భౌతికదూరం పాటిస్తూ విజయం సాధించగలిగామని, మరికొంత కాలం పంటి బిగువనో, ఒంటి బిగువనో ఓర్చుకుంటే సంపూర్ణ విజయం సాకారమవుతుందన్నారు. ఇవాళ కొత్తగా 11 మందికి కరోనా నిర్ధారణ అయిందని, తెలంగాణలో మొత్తం కేసుల సంఖ్య 1096 అని, ప్రస్తుతానికి 439 యాక్టివ్ కేసులు ఉన్నాయని వివరించారు. దేశవ్యాప్తంగా కరోనా మరణాల రేటు 3.37 ఉంటే, రాష్ట్రంలో 2.54 మాత్రమేనని గుర్తుచేశారు. 
 
అంతేకాకుండా, ప్రజలు ప్రజలు స్వీయ నియంత్రణలో ఉంటేనే కరోనా కట్టడి సాధ్యమన్నారు. రాష్ట్రం మొత్తమ్మీద ఇప్పటివరకు 628 కరోనా నుంచి కోలుకున్నారని తెలిపారు. కేంద్రం మార్గదర్శకాలకు అనుగుణంగా కరోనా ప్రభావిత ప్రాంతాలను రెడ్ జోన్, ఆరెంజ్ జోనుగా, కరోనా లేని ప్రాంతాలను గ్రీన్ జోన్‌గా విభజించారని తెలిపారు. 
 
తెలంగాణలో 6 జిల్లాలు రెడ్ జోన్‌లో ఉన్నాయని, సూర్యాపేట, వికారాబాద్, మేడ్చెల్, హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ అర్బన్  జిల్లాలు రెడ్ జోన్ కింద ఉన్నాయని చెప్పారు. ఇక, యాదాద్రి భువనగిరి, వరంగల్ రూరల్, వనపర్తి, భద్రాద్రి కొత్తగూడెం, సిద్ధిపేట్, ములుగు, మహబూబాబాద్, నాగర్ కర్నూలు, పెద్దపల్లి జిల్లాలు గ్రీన్ జోన్‌లో ఉన్నాయని వివరించారు. 
 
మరో 18 జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని సీఎం కేసీఆర్ తెలిపారు. సంగారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, జయశంకర్ భూపాలపల్లి, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల్, మంచిర్యాల్, నారాయణపేట్, రాజన్న సిరిసిల్ల, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, జనగామ, కొమురం భీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, జోగులాంబ గద్వాల జిల్లాలు ఆరెంజ్ జోన్‌లో ఉన్నాయని పేర్కొన్నారు. కేంద్రం మార్గదర్శకాల ప్రకారం ఆయా జోన్ల పరిధిలో నియమనిబంధనలు వర్తిస్తాయని స్పష్టం చేశారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కరోనా కష్టాలకు తోడు దొడ్డిదారిన పెట్రో ధరల బాదుడు...