Publish Date: Wed, 12 May 2021 (19:27 IST)
Updated Date: Wed, 12 May 2021 (19:28 IST)
భారత్లో కోవిడ్ రెండో దశ ఉద్ధృతి జులై వరకూ కొనసాగే అవకాశముందని ప్రముఖ వైరాలజిస్టు షాహిద్ జమీల్ అంచనా వేశారు. ప్రస్తుతం కేసుల పెరుగుదల స్థిరంగా కొనసాగుతోందని పేర్కొన్నారు. మొదటి దశతో పోలిస్తే, రెండో దశలో పరిస్థితులు కుదుటపడేందుకు ఎక్కువ సమయం పడుతుందని అభిప్రాయపడ్డారు.
ఆన్లైన్ వేదికగా మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. మరిన్ని దశల్లో భారత్ను కరోనా మహమ్మారి చుట్టుముట్టే అవకాశాలు కనిపిస్తున్నాయని తెలిపారు.
టీకాల పంపిణీని వేగంగా పూర్తిచేస్తే దశల సంఖ్యను తగ్గించవచ్చునని పేర్కొన్నారు. ఉత్పరివర్తనాలతో పుట్టుకొస్తున్న కొత్త రకం కరోనా వైరస్ల కారణంగా కేసులు వేగంగా పెరుగుతున్నమాట వాస్తవమేనని జలీల్ చెప్పారు. అయితే- అవి మరణాల పెరుగుదలకు కారణమవుతున్నట్లు ఎలాంటి ఆధారాలూ లేవన్నారు.