Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు - వణుకు పుట్టిస్తున్న వైరస్

దేశంలో 19 లక్షలు దాటిన కరోనా కేసులు - వణుకు పుట్టిస్తున్న వైరస్
, బుధవారం, 5 ఆగస్టు 2020 (11:16 IST)
దేశంలో కరోనా వైరస్ ప్రజల, పాలకులవెన్నులో వణుకు పుట్టిస్తోంది. ప్రతి రోజూ వేల సంఖ్యలో జనం ఈ వైరస్ బారినపడుతున్నారు. తాజాగా గడచిన 24 గంటల్లో ఏకంగా 52,509 మంది ఈ వైరస్ బారినపడ్డారు. అదేసమయంలో 857 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయినట్టు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ విడుదల చేసిన ఓ ప్రకటనలో పేర్కొంది. 
 
దేశంలో కరోనా కేసుల సంఖ్య ఇప్పటివరకు మొత్తం 19,08,255కు చేరగా, మృతుల సంఖ్య మొత్తం 39,795కి పెరిగింది. 5,86,244 మందికి ఆసుపత్రుల్లో చికిత్స అందుతోంది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 12,82,216 మంది కోలుకున్నారు.
 
కాగా, నిన్నటివరకు మొత్తం 2,14,84,402 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్)  తెలిపింది. నిన్న ఒక్కరోజులో 6,19,652 శాంపిళ్లను పరీక్షించినట్లు ఐసీఎంఆర్ వివరించింది. 
 
తెలంగాణాలో కొత్తగా 2 వేల పాజిటివ్ కేసులు 
తెలంగాణలో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ బుధవారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో కొత్తగా 2,012 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయింది. అదే సమయంలో 1,139 మంది కోలుకోగా, 13 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు.  
 
ఇక రాష్ట్రంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 70,958కి చేరింది. ఆసుపత్రుల్లో 19,568 మందికి చికిత్స అందుతోంది. తెలంగాణలో ఇప్పటివరకు కరోనా నుంచి 50,814 మంది కోలుకున్నారు. మృతుల సంఖ్య మొత్తం 576కి చేరింది. జీహెచ్‌ఎంసీ పరిధిలో అత్యధికంగా 532 కరోనా కేసులు నమోదయ్యాయి. 
 
కరోనా ప్రపంచ రికార్డు
దేశంలో కరోనా వైరస్ ఉధృతి ఏమాత్రం తగ్గడం లేదు. దీంతో కరోనా వైరస్ దేశంలో ప్రపంచ రికార్డులను బద్ధలుకొడుతోంది. నిజానికి కరోనా వైరస్ కట్టడిలో అన్ని ప్రపంచ దేశాలు పైచేయి సాధించాయి. కానీ, భారత్‌లో మాత్రం ఈ పరిస్థితి ఎక్కడా కనిపించడం లేదు. పైగా, ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. 
 
వైరస్ తొలుత వ్యాపించిన దేశాలతో పోలిస్తే, ఎంతో ఆలస్యంగా కేసులు ప్రారంభమైన ఇండియాలో ఇప్పుడు వైరస్ విజృంభిస్తోంది. రోజువారీ కేసులు, మరణాల విషయంలో ఇప్పుడు అమెరికాను కూడా ఇండియా దాటేసింది. వరుసగా రెండో రోజు కూడా అత్యధిక కొత్త కేసులు ఇండియాలోనే నమోదు కావడం గమనార్హం.
 
కేసుల సంఖ్యలో తొలి స్థానంలో ఉన్న అమెరికాలో సోమవారం 48,622 కేసులు రాగా, రెండో స్థానంలో ఉన్న బ్రెజిల్‌లో 17,988 కేసులు రాగా, ఇండియాలో 49,134 కొత్త కేసులు వచ్చాయి. ఇదేసమయంలో బ్రెజిల్‌లో 572 మంది, యూఎస్‌లో 568 మంది మరణించగా, ఇండియాలో 814 మంది వైరస్ కారణంగా కన్నుమూశారు. ఆపై మంగళవారం నాడు మాత్రం ఇండియాలో కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది.
 
ప్రస్తుతం ఇండియాలో కేసుల సంఖ్య 19.04 లక్షలను దాటేసింది. రోజువారీ కేసుల్లో ఆంధ్రప్రదేశ్ మిగతా రాష్ట్రాలతో పోలిస్తే అత్యధికంగా 9,747 కొత్త కేసులను కళ్లజూసింది. ఆ తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 7,760 కేసులు వచ్చాయి. 
 
ఈ సంఖ్య గడచిన ఆరు రోజులతో పోలిస్తే కాస్తంత తక్కువే అయినప్పటికీ, మరణాల విషయంలో మాత్రం మరో రికార్డు నమోదైంది. మహారాష్ట్రలో మంగళవారం నాడు 322 మంది మరణించారు. కర్ణాటకలోనూ వైరస్ విజృంభణ అధికంగానే ఉంది. బెంగళూరు నగరంలో కొత్తగా 2,035 కేసులు వచ్చాయి.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సివిల్స్‌లో సత్తా చాటిన తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు - వారు వీరే...