Publish Date: Wed, 15 Jun 2022 (11:08 IST)
Updated Date: Wed, 15 Jun 2022 (11:10 IST)
దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. తాజాగా మరోసారి 8 వేలకు పైగా కేసులు రాగా.. ముందురోజు కంటే 33 శాతం అధికంగా నమోదయ్యాయి. క్రియాశీల కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది.
మంగళవారం 4.40 లక్షల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా.. 8,822 మందికి వైరస్ సోకినట్లు తేలింది. క్రితంరోజు ఆ సంఖ్య 6,594గా ఉంది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 2 శాతానికి చేరింది.
మహారాష్ట్రలో 2,956, కేరళలో 1,986, ఢిల్లీలో 1,118 మందికి కరోనా సోకింది. హర్యానా, కర్ణాటకతో సహా పలు రాష్ట్రాల్లో వైరస్ విస్తరిస్తోన్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకూ 4.32 కోట్ల మందికి పైగా మహమ్మారి బారినపడ్డారు.
24 గంటల వ్యవధిలో 5,718 మంది కొవిడ్ నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకూ 98.66 శాతం మంది వైరస్ నుంచి బయటపడ్డారు. మంగళవారం 15 మంది మరణించగా.. మొత్తంగా 5.24 లక్షల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.