Publish Date: Fri, 21 Aug 2020 (13:11 IST)
Updated Date: Fri, 21 Aug 2020 (13:12 IST)
ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ దెబ్బకు ప్రజలు వణికిపోతున్నారు. ఈ వైరస్ బారినపడితే ఇక ప్రాణాలపై ఆశ వదులుకోవాల్సిందేనన్న భయం ఆవహిస్తోంది. దీంతో ఈ వైరస్ సోకడం వల్ల చనిపోతున్నవారి సంఖ్య కంటే.. కరోనా వైరస్ సోకిందన్న భయంతో మరణిస్తున్న వారి సంఖ్యే ఎక్కువగా ఉంది. అయితే, ఈ వైరస్ బారినపడి కోలుకున్నవారు కొన్ని నెలల పాటు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ముఖ్యంగా, ఆహారం హడావుడిగా తినకూడదట. పైగా, ఏది పడితే అది తీసుకోరాదని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, ఆహారం తీసుకునే విషయంలో ఖచ్చితంగా ఆహార వేళలు పాటించాలట. ఎక్కువగా మసాలాతో కూడిన ఆహార పదార్థాలు ఆరగించకూడదట.
డిశ్చార్జి సమయంలో వైద్యులు రాసిచ్చిన మందులను పూర్తి కాలం, పూర్తి డోస్ వాడాలని చెబుతున్నారు. కాళ్లు, మెదడు, రక్త నాళ్లాలో సరఫరాలో అవరోధాలు ఏర్పడితే రక్తం పల్చబడే మందులు వినియోగించాలి. రోగ నిరోధక శక్తినిచ్చే పండ్లు, ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి. క్రమం తప్పకుండా వేడినీరు తాగాలని సలహా ఇస్తున్నారు. వీలుంటే ప్రతి రోజూ స్టీమ్ థెరపీ చేసుకున్నట్టయితే సంపూర్ణ ఆరోగ్యవంతులు కావొచ్చని వైద్యులు సలహా ఇస్తున్నారు.
ఎందుకంటే కరోనా వైరస్ నుంచి కోలుకున్న తర్వాత ఊపిరితిత్తుల టిష్యూలు గట్టిపడతాయి. దాంతో తీవ్రమైన అలసట, కండరాల నొప్పులతో రెండు, మూడు నెలల వరకు బాధపడే అవకాశముంది. వీరికి ఇంటిదగ్గరే దీర్ఘకాలికంగా ఆక్సిజన్ ఇవ్వాలి. సరైన మోతాదులో ఆక్సిజన్ అందకపోతే గుండె విఫలమయ్యే అవకాశం ఉంది. కరోనా సమయంలో ఇచ్చే మందులతో ఇన్ఫెక్షన్, న్యుమోనియా వంటివి తగ్గిపోవాలి. ఇలా తగ్గకపోతే శ్వాసకోశ సమస్యలు వస్తాయి. ఇలాంటి వారికి ఇంట్లో ఆక్సిజన్ థెరపీయే ఏకైక పరిష్కారమని వైద్యులు సలహా ఇస్తున్నారు.