Publish Date: Thu, 22 Apr 2021 (18:59 IST)
Updated Date: Thu, 22 Apr 2021 (19:01 IST)
ప్రపంచాన్నే భయపెట్టిన, కరోనాను కొంతమంది నిర్లక్ష్యం చేస్తున్నారు. ప్రభుత్వం అప్రమత్తం చేసినా, ప్రభుత్వ యంత్రాంగం ఉదాసీనత అవలంభిస్తోంది. పేద మధ్యతరగతి ప్రజలు వైద్యం కోసం ప్రభుత్వ ఆసుపత్రిని ఆశ్రయిస్తే కనీసం పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం వెళ్ళిన వారు, ఊపిరితో తిరిగి ఇంటికి రావడం లేదు.
తాజాగా విద్యాధరపురం లేబర్ కాలనీకి చెందిన ఓ వ్యక్తికి కరోనా సోకింది. ఈనెల 20వ తేదీన భార్య, కూతురుతో విజయవాడలో ఉన్న ప్రైవేట్ హాస్పటల్స్ చుట్టూ తిరిగి బెడ్స్ ఖాళీ లేవని హాస్పటల్ వాళ్ళు తెలియజేయడంతో, అత్యవసర వైద్యం అందకపోవడంతో ఆక్సిజన్ లెవెల్స్ 70 శాతానికి పడిపోవడంతో, కంగారు పడిన కుటుంబ సభ్యులు నమ్మకంతో 20వ తేదీన సుమారుగా రాత్రి 8 గంటలకు విజయవాడ గవర్నమెంట్ హాస్పిటల్కు వెళ్లగా, అర్థరాత్రి 2 గంటలకు వార్డుకు తీసుకువెళ్లారు. ఈ ఘటన ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది ఎంత నిర్లక్ష్యంగా ఉన్నారో అర్థం చేస్తుంది.
22వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు భర్త మరణించాడు అని గవర్నమెంట్ హాస్పిటల్ వారు తెలియజేయడంతో ఒక్కసారిగా తల్లీకూతుళ్లు ఇద్దరూ కుప్పకూలిపోయారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్లో నా భర్తకు సరైన వైద్యం అందించలేదని, మరణించిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు.
ఇలా ఎంతో మంది కరోనా బారిన పడ్డ వారికి వైద్యం సరిగ్గా అందక ఎన్నో కుటుంబాలు వీధిన పడ్డాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఈ విషయంపై దృష్టి సారించాలి, కరోనాను నియంత్రించాలి ఎవరైతే నిర్లక్ష్యంగా వ్యవహరించారో సంబంధిత వైద్య వ్యవస్థపై చర్యలు చేపట్టి, భారతదేశాన్ని, మన రాష్ట్రాన్ని, స్థానికంగా ఉండే సమాజాన్ని, కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది.