Publish Date: Wed, 24 Mar 2021 (09:45 IST)
Updated Date: Wed, 24 Mar 2021 (09:36 IST)
కరోనా మహమ్మారి గత కొన్ని రోజులుగా దేశంలో విస్తరిస్తోంది. కరోనా కేసులు పెరుగుతుండటంతో ఇప్పటికే మహారాష్ట్రలో ఆంక్షలు విధించారు. కొన్ని నగరాల్లో లాక్ డౌన్, మరికొన్ని నగరాల్లో నైట్ కర్ఫ్యూ కొనసాగుతోంది. ఎక్కువ మంది ఒకచోట గుమిగూడి ఉండొద్దని కరోనా వ్యాప్తి నివారణకు ప్రతి ఒక్కరు సహకరించాలని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నది. అయితే, దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటి హోలీ.
ఈనెల 29 వ తేదీన హోలీ పండుగ రాబోతుంది. ఈ హోలిపై కరోనా ప్రభావం ఉండే అవకాశం ఉంది. ఢిల్లీలో ఇప్పటికే హోలీ వేడుకలను, నవరాత్రి వేడుకలపై ఆంక్షలు విధించారు. మహారాష్ట్రతో పాటుగా ఢిల్లీలో కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఢిల్లీ సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. కేసుల సంఖ్య పెరిగితే వేడుకలపై ఆంక్షలు విధించే అవకాశం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గడిచిన 24 గంటల్లోనే ఇంత భారీ సంఖ్యలో పాజిటివ్ కేసులు రావడం కలవరపెడుతోంది. దీంతో ఢిల్లీ ప్రభుత్వం హోలీ, నవరాత్రి వేడుకలపై నిషేధం విధిస్తున్నట్టు ప్రకటించింది. అలాగే, వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు చేయాలని నిర్ణయించింది. ఈ మేరకు విమానాశ్రయాలు, రైల్వే స్టేషన్లు, బస్టాండ్లలో కోవిడ్ పరీక్షలు చేయనున్నారు.