Publish Date: Thu, 26 Dec 2019 (10:23 IST)
Updated Date: Thu, 26 Dec 2019 (10:25 IST)
భారత్కు టర్కీ తేరుకోలేని షాకిచ్చింది. ఉల్లిపాయల ఎగుమతిని తాత్కాలికంగా నిలిపివేసింది. ఫలితంగా ఉల్లి ధరలు మళ్లీ పెరిగిపోనున్నాయి. నిజానికి దేశ వ్యాప్తంగా డిసెంబరు 15వ తేదీ వరకు ఉల్లి ధరలు తారాస్థాయిలో ఉన్న విషయం తెల్సిందే. ఇపుడు కాస్త ఉల్లిఘాటు తగ్గింది. ఫలితంగా ధరలు కూడా కొంతమేరకు తగ్గాయి. అయితే, ఈ ధరల ఊరట మూణ్ణాళ్ళ ముచ్చటగా మారింది. మరో వారంలో ఉల్లి దరలు 15 శాతం వరకూ పెరగవచ్చని సమాచారం.
వాస్తవానికి దేశ వ్యాప్తంగా విస్తారంగా కురిసిన భారీ వర్షాల వల్ల ఉల్లి దిగుబడి తగ్గిపోయింది. పైగా, కొత్త పంట చేతికిరాలేదు. ఫలితంగా ఓ దశలో కిలో ఉల్లి ధర రూ.200 వరకు చేరింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లలో భాగంగా, ఉల్లి అధికంగా పండే టర్కీ, ఈజిప్ట్ తదితర దేశాల నుంచి కేంద్రం పెద్దఎత్తున దిగుమతులు చేపట్టింది. ఈ సంవత్సరం ఇప్పటివరకూ 7,070 టన్నుల ఉల్లిపాయలు దిగుమతి కాగా, అందులో 50 శాతం టర్కీ నుంచే వచ్చాయి.
అయితే, దేశంలో ఉన్న డిమాండ్ను అందుకునేందుకు అమితాసక్తి చూపి, వేల టన్నుల ఉల్లిని ఎగుమతి చేయడంతో, అక్కడ కొరత ఏర్పడి, ఉల్లి ధరలు సామాన్య ప్రజలకు అందకుండా పోయాయి. దీంతో విమర్శలు వెల్లువెత్తడంతో భారత్కు ఎగుమతులను తాత్కాలికంగా నిలిపివేయాలని ఆ దేశం నిర్ణయించినట్టు సమాచారం.