Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

రైల్వేస్‌లో కరోనా కల్లోలం.. 93వేల మంది సిబ్బందికి కరోనా.. రైళ్లను నడపటం..?

రైల్వేస్‌లో కరోనా కల్లోలం.. 93వేల మంది సిబ్బందికి కరోనా.. రైళ్లను నడపటం..?
, శనివారం, 24 ఏప్రియల్ 2021 (23:39 IST)
దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. సెకండ్ వేవ్‌లో మహమ్మారి రెట్టింపు వేగంతో విస్తరిస్తుండడంతో ప్రపంచ రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి.

వరుసగా మూడో రోజు మూడు లక్షలకుపైగా కేసులు, రెండు వేలకుపైగా మరణాలు వెలుగు చూశాయి. దీంతో మూడు రోజుల్లోనే దాదాపు పది లక్షల వరకు కరోనా కేసులు నమోదవగా.. 7వేలకుపైగా జనం ప్రాణాలు వదిలారు.

గడిచిన 24 గంటల్లో రికార్డు స్థాయిలో 3లక్షల 46వేల 786 కరోనా కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వశాఖ శనివారం (ఏప్రిల్ 24,2021) తెలిపింది. మరో 2వేల 624 మంది ప్రాణాలు కోల్పోయారు.
 
ఇలా ప్రపంచ దేశాలతో పాటు భారత్‌ను వణికిస్తున్న కరోనా వైరస్ ఇండియన్ రైల్వేస్‌లో కల్లోలం రేపింది. భారీ సంఖ్యలో రైల్వే ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. ఏకంగా 93వేల మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ మేరకు రైల్వే బోర్డు చైర్మన్, సీఈవో సునీత్ శర్మ తెలిపారు.

ఈ కేసుల సంఖ్య గత కొద్ది వారాల నుంచి తీవ్రమైందన్నారు. కరోనా బారిన పడ్డ రైల్వే ఉద్యోగులకు రైల్వేస్‌కు సంబంధించిన 72 ఆస్పత్రుల్లో చికిత్స కొనసాగుతోందని, 5వేలకు పైగా పడకలను సిద్ధంగా ఉంచామని ఆయన వెల్లడించారు.
 
కరోనా తీవ్రత తక్కువగా ఉన్న ఉద్యోగులు హోం ఐసోలేషన్‌లో ఉంటూ వైద్యుల సూచనలను పాటిస్తున్నట్లు చెప్పారు. రైల్వేలో ఫ్రంట్ లైన్ వర్కర్లు అయినా డ్రైవర్లు, గార్డ్స్, మెయింటెనర్స్, స్టేషన్ మాస్టర్లు, టీటీఈలతో పాటు స్టేషన్ సిబ్బంది విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నామని శర్మ వివరించారు. ఈ పరిస్థితుల్లో రైళ్లను నడిపించడం పెద్ద చాలెంజ్ అని శర్మ చెప్పారు. అందుబాటులో ఉన్న సిబ్బందితోనే పనులు జరిగేలా చూస్తామన్నారు.
 
రైల్వే కేవలం ప్రయాణికులు, గూడ్స్ కోసం మాత్రమే కాదు ఇతర ముఖ్యమైన వస్తువులను కూడా వేగంగా ట్రాన్స్ పోర్టు చేస్తుంది. ప్రస్తుతం రైల్వే సంస్థ కొన్ని చాలెంజ్‌లు ఎదుర్కోంటోంది. దేశానికి సేవలు అందించేందుకు 12లక్షల మంది రైల్వే ఉద్యోగులు 24గంటల పాటు పని చేస్తున్నారని మిశ్రా చెప్పారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా: కఠిన లాక్డౌన్ అవసరం.. మేలో పరిస్థితి..?: అమెరికా హెచ్చరిక