Publish Date: Wed, 12 Feb 2020 (13:43 IST)
Updated Date: Wed, 12 Feb 2020 (13:45 IST)
చాలా మంది రెండు మూడు పాన్ కార్డులను కలిగివుంటారు. ఇలాంటివారు ఇకపై జాగ్రత్త పడకపోతే చిక్కుల్లో పడే ప్రమాదముంది. నిజానికి ఆదాయ పన్ను చట్టం 1961లోని సెక్షన్ 139ఏ నిబంధన మేరకు ఒక వ్యక్తి ఒకే పాన్ నంబర్ను కలిగి ఉండాలి. ఈ నిబంధనను అతిక్రమిస్తే అపరాధం విధిస్తారు.
ఇపుడు ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ నిబంధనను తెరపైకి తెచ్చారు. అంటే.. ఇకపై ఈ నిబంధనను తు.చ తప్పకుండా అమలు చేయనున్నారు. రెండు పాన్ కార్డులు కలిగివున్నవారు తక్షణం ఒక కార్డును సరెండర్ చేయకుంటే రూ.10 వేల వరకు అపరాధం విధించనున్నారు.
అయితే కొన్ని ప్రత్యేక కారణాల ద్వారా ఎక్కువ పాన్కార్డులను కలిగి ఉన్నవారు వెంటనే వాటిని అధికారులకు సమర్పించి, జరిమానా నుంచి తప్పించుకునే అవకాశాన్ని ఆదాయపుపన్ను శాఖ కల్పిస్తోంది.
ప్రవాస భారతీయులకు మాత్రం ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులుండే అవకాశం ఉంది. అలా ఒకటి కన్నా ఎక్కువ పాన్ కార్డులు ఉన్నవారు వెంటనే ఐటీ వెబ్సైట్కు వెళ్లి 'సరెండర్ డూప్లికేట్ పాన్' ఆప్షన్ క్లిక్ చేసి, అడిగిన వివరాలు పొందుపర్చి అదనంగా ఉన్న పాన్ కార్డులను రద్దు చేసుకోవచ్చని ఆదాయ పన్ను శాఖ అధికారులు చెబుతున్నారు.