Publish Date: Fri, 04 Oct 2019 (14:24 IST)
Updated Date: Fri, 04 Oct 2019 (14:27 IST)
ముల్తానీ మట్టిని కేవలం ముఖ సౌందర్యానికే పరిమితం చేయనక్కర్లేదు. దీనివలన జుట్టుకు సంబంధించిన సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుంది. దాన్ని కొన్ని పదార్థాలతో కలుపుకుని పూతలా వేసుకుంటే మంచి ఫలితాలను పొందవచ్చును. మరి అవేంటో చూద్దాం.
జుట్టు జిడ్డుగా మారి అంటుకున్నట్లుగా అవుతుంటే మూల్తానీ మట్టిలో గుడ్డులోని తెల్లసొనను ఆ మట్టిలో కలుపుకుని రాసుకోవాలి. ఇప్పుడు తలస్నానం చేయబోయే నీటిలో కాస్త నిమ్మరసం కలుపుకుంటే గుడ్డు వాసన తొలగిపోతుంది. ముల్తానీ మట్టిలో కాస్త పెరుగు, నువ్వుల నూనె కలిపి తలకు పట్టించాలి.
20 నిమిషాల తరువాత తలస్నానం చేస్తే జుట్టు రాలిపోకుండా ఒత్తుగా పెరుగుతుంది. కొంతమందికి తలస్నానం చేసిన రెండో రోజే జుట్టు జిడ్డుగా మారిపోతుంది. అలాంటివాళ్లు ముల్తానీమట్టిలో నీళ్లు కలుపుకుని తలకు రాసుకుంటే మంచి ఫలితాలు లభిస్తాయి. అయితే దీనిని తరచుగా మాత్రం చేయకూడదు. ఎక్కువగా చేస్తే మాడులో సహజంగా ఉండే నూనెలు విడుదలవ్వవు.
చుండ్రు సమస్యలతో బాధపడేవారు కొన్ని మెంతులను కొన్ని మెంతులను రాత్రంతా నానబెట్టి ముద్దలా తయారుచేసుకోవాలి. ఆ మిశ్రమంలో కాస్త ముల్తానీమట్టిని కలుపుకుని తలకు రాసుకోవాలి. అరగంట తరువాత తలస్నానం చేస్తే చుండ్రు నుంచి విముక్తి చెందవచ్చును.