Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చిన్న జీయర్: ‘పూసుకుని తిరగను, పాకులాడను.. ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు’

చిన్న జీయర్: ‘పూసుకుని తిరగను, పాకులాడను.. ఎవరితోనూ గ్యాప్స్ ఉండవు. వాళ్లు పెట్టుకుంటే చేసేదేమీ లేదు’
, శుక్రవారం, 18 మార్చి 2022 (19:47 IST)
తెలంగాణలోని ఆదివాసీ వనదేవతలు సమ్మక్క, సారలమ్మల గురించి 20 ఏళ్ల కిందట తాను చేసిన వ్యాఖ్యలను ఇప్పుడు కొందరు పనిగట్టుకుని పెద్ద ఇష్యూగా చేసి, ప్రజలను రెచ్చగొడుతున్నారని చిన్న జీయర్ అన్నారు. విజయవాడలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలోని యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర ప్రభుత్వం ఆహ్వానించలేదు కదా అని మీడియా అడగ్గా చిన్న జీయర్ స్పందిస్తూ.. తాను దేంట్లోనూ, ఎవరితోనూ పూసుకుని తిరగనని, తనకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండవని అన్నారు.

 
సమతా మూర్తి దర్శనానికి టికెట్ రుసుము వసూలు చేయడంపై స్పందిస్తూ.. రూ.150 రూపాయలు టికెట్ పెట్టామని, అయితే అది ఆ ప్రాంగణ నిర్వహణ కోసమే తప్ప లోపల పూజలకు కానీ, ప్రసాదాలకు కానీ ఎలాంటి టికెట్లు లేవని తెలిపారు.

 
సమ్మక్క-సారలమ్మ వ్యాఖ్యల వివాదంపై..
స్వీయ ఆరాధన, సర్వ ఆదరణ అనేదే మా సిద్ధాంతం. కొంతమంది దేవతలను చిన్నచూపు చూసేట్లు మాట్లాడతాం అనుకోవడం పొరపాటు. ఒక మాట విన్నప్పుడు, ఒక నిర్ణయం చేసేప్పుడు పూర్వాపరాలు చూడటం అవసరం. అవి చూడకుండా ఇవి ఈ వ్యక్తి అన్నాడు అంటే హాస్యాస్పదం. ఆదివాసీ జనాలను ఏదో అన్నామని.. కామెంట్లు చేస్తున్నట్లు వినిపిస్తోంది. అలా కామెంట్ చేయడం ఉండదు. అలాంటి వాళ్ల పేర్లు చెప్పి, సొంత లాభాలకు వాడుకునే వ్యక్తులను, అదొక సామాజిక అనారోగ్యం ఉన్నప్పుడు తప్పకుండా చెప్పాల్సిన బాధ్యత ఎవరికో ఒకరికి ఉంటుంది. సమాజహితం కోరే వ్యక్తిగా నేను అలా చెబుతాను.

 
బహుశా 20 సంవత్సరాల క్రితం అన్న మాట గురించి ఇలా వచ్చింది అని మా వాళ్లు చెప్పారు. 20 సంవత్సరాలకు పూర్వం మాట్లాడిన మాటల్ని తీశారు. దానికి పూర్వం పర్వం ఉండే ఉంటుంది. అది చూశారా లేదా ప్రశ్న వేసుకోవాలి. మేం గ్రామ దేవతలను తూలనాడినట్లు, ఆదివాసీలందరికీ అవమానం జరిగినట్లు భావిస్తున్నారు. వాళ్లు దాన్ని సవరించుకోవాలి. ఆదివాసీల కోసం స్కూళ్లు, ఆరోగ్య శిబిరాలు పెట్టాం. వికాసతరంగణి అనే సేవాసంస్థ తరపున ఆరోగ్య వికాస్ విభాగం తరపున చాలా కార్యక్రమాలు చేశాం. క్యాన్సర్ వంటివి గుర్తించి, తగ్గించే పని చేస్తున్నాం. మహిళల ఆరోగ్యం కోసం అవగాహనా కార్యక్రమాలు చేపట్టి, ఒకరోజు ఉచిత శిబిరం చేపడుతున్నాం. 12.5 లక్షల మంది మహిళలకు పరీక్షలు జరిపాం.

 
కారణం ఏంటో వాళ్ల వివేచనకే వదిలేస్తున్నాం. పనికట్టుకుని దాన్ని పెద్ద ఇష్యూ చేసి, టీవీల్లో వాళ్లవాళ్ల ముఖాలను ప్రదర్శిస్తున్నారని వింటున్నాం. రష్యా యుక్రెయిన్ హడావుడి తగ్గింది. వేరే హడావుడి మొదలు కాలేదు. ఏదో ఒకటి ఉండాలని దీన్ని ఇష్యూ చేస్తున్నారు. నిజంగా సమాజహితం కోరే వ్యక్తులైతే వచ్చి మాట్లాడాలి. చర్చించుకోవాలి. భావావేశాన్ని ప్రదర్శిస్తున్నారు. పబ్లిసిటీ కోసం అల్ప ప్రచార కార్యక్రమాలు చేస్తున్నారు. ఇందులో సామాజిక హితం లేదు. సమాజానికి హితకరమైన కార్యక్రమాలైనా మేం ఉంటాం. అలాంటి వాటితో కలవడానికి సిద్ధం.

 
ఆస్తికులు, నాస్తికులు... సమాజ హితం కోసం అందరూ కలసి పనిచేయాలి.
అమాయకులైన ప్రజలను రెచ్చగొట్టడం సులభం. ప్రజల్ని రెచ్చగొట్టడంతో తాత్కాలిక ప్రయోజనాలను నెరవేర్చవచ్చు. కానీ దీర్ఘకాలిక ప్రయోజనాలను నెరవేర్చదు. చెట్టూపుట్టాగట్టు అన్నింటినీ గౌరవించాలి అని భారతీయ సంప్రదాయం చెబుతోంది. మనం అన్ని పండుగల్లోనూ వాటిని పాటిస్తున్నాం. ఇది చక్కని సంప్రదాయం. ప్రకృతిని, ప్రాణికోటిని గౌరవించడం అందరి బాధ్యత.

 
ఆ దేవతలు స్వర్గం నుంచి రాలేదు. దైవత్వం కల్పించి మనవాళ్లు పూజలు చేస్తున్నారు. రామానుజుల మార్గంలోనే ఇది జరుగుతోంది. ఆదివాసీలు కనుక, హరిజనులు కనుక దూరం పెట్టాలి అనే పద్ధతి లేదు. హరిజనులైనా సరే జ్ఞానంలో ఉత్తములైతే వారిని ఆరాధించాలి. గ్రామాల్లో జీవించిన ఆ దేవతలు చాలావరకు నిరక్షరాస్యులు, జ్ఞానం కలిగిన వాళ్లు. అందుకే ఆనాటి గ్రామీణ పరిస్థితుల ప్రకారం వారికి దైవత్వం కల్పించారు. స్వర్గం నుంచి వచ్చి దేవతలు కాలేదు. గుణం వల్ల దేవతులయ్యారు. వారిని మధ్యలో పెట్టుకుని అసాంఘీక కార్యక్రమాలను ప్రోత్సహించవద్దు. విషయం తెలుసుకోకుండా.. ఒక మాట పట్టుకుని దీనిని పైకి తీసుకురావాల్సిన అవసరం ఏముంది.

 
దేశం, ప్రపంచం మాట్లాడుకుంటోంది హైదరాబాద్ సమతామూర్తి కార్యక్రమం గురించి, దానిని సహించలేకపోతున్నారా? తెలీదు. సమతామూర్తి దర్శనానిని టికెట్ పెట్టలేదు. దాని నిర్వహణకు రుసుం పెట్టకపోతే వచ్చే జనాన్ని కంట్రోల్ చేయడం కష్టం. సామాన్యులకు కూడా అందుబాటులో ఉండాలనే రూ.150 పెట్టారు. ఈ రుసుము ప్రాంగణ నిర్వహణ కోసం. పూజలకు, ప్రసాదాలకు టికెట్లు లేవు.

 
మాంసాహారం తినొద్దు అని ఎందుకు అన్నానంటే..
మాంసాహారం తగదు అని చెప్పింది సంప్రదాయ దీక్షలు తీసుకోవాలనుకునే వారికి. రోడ్డుమీద పోయే పుల్లయ్యలకు చెప్పింది కాదు.

 
రాజకీయాల్లో చేరతారా?
రాజకీయాలకు చాలాదూరం. అందరూ సమానమే. నేనొక సాధువు. సాధారణ వ్యక్తి, సామాన్య సన్యాసి, భిక్షా సన్యాసి. మా కార్యక్రమాలు తెలియకుండా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు. అడగడానికి అవకాశం వచ్చింది కదా అని అడగొద్దు. రాజకీయాల్లోకి వెళ్లాలనే కోరిక లేదు. అలాంటిది మనస్సులోకి ఎప్పుడూ రాలేదు. రాదు. ఆ ప్రశ్నే తప్పు.

 
కేసీఆర్‌తో గ్యాప్ వచ్చిందా? యాదాద్రి ఆలయ ప్రారంభోత్సవానికి ఎందుకు ఆహ్వానించలేదు?
మాకు ఎవరితోనూ గ్యాప్స్ ఉండదు. వాళ్లు పెట్టుకుంటే మేం చేసేదేమీ లేదు. మేం మంచి లక్ష్యంతో మంచి కార్యక్రమాలు చేయాలి, ఎవరినీ మోసం చేయకూడదు అని ఉంటాం. వీడికీ వాడికీ జడుస్తూ, మూలకి నక్కి మాట్లాడుతూ ఉంటారు కొందరు. అలాంటిది మా చరిత్రలో లేదు. 1986లో చల్లా కొండయ్య కమిషన్‌కు వ్యతిరేకంగా మాట్లాడినప్పటి నుంచి ఏదైనా సరిగ్గా జరగట్లేదు అనుకుంటే నేను ఇలాగే మాట్లాడుతుంటాను. మేం కాక మరెవరు చెబుతారు? మేం సమాజానికి కళ్లు.

 
మేం దేంట్లోనూ పూసుకు తిరిగేవాళ్లం కాదు. ఎవరైనా ఏదైనా సలహా అడిగితే, చేసి పెట్టండి అంటే చేసిపెట్టడమే మా బాధ్యత. అందులో మాత్రం నూటికి 100.01 పర్సెంట్ న్యాయం చేస్తాం. బాధ్యత తీసుకోనప్పుడు మాత్రం ఇది కావాలి అని వెంటపడి, పాకులాడే అలవాటు లేదు. ఏ విషయంలోనూ వెంటపడి ఎదురుచూడం. అడిగితే చెబుతాం. పిలిస్తే వెళతాం. లేదంటే చూసి ఆనందిస్తాం.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పర్యాటకుల కోసం వీటీఎల్ పేరుతో స్పెషల్ ఫ్లైట్లు : ఎస్.టి.బి