Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీరామనవమి: ఆంజనేయుడి జన్మస్థలం ఏది?

శ్రీరామనవమి: ఆంజనేయుడి జన్మస్థలం ఏది?
, బుధవారం, 21 ఏప్రియల్ 2021 (14:03 IST)
రామాయణం ప్రకారం రాముడికి బంటుగా భావించే హనుమంతుడి జన్మస్థలంపై కొత్త చర్చ తెర మీదకు వచ్చింది. తిరుమల గిరులలో ఉన్న అంజనాద్రిని హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ నియమించిన బృందం నిర్ధరించింది. జాతీయ సంస్కృత వర్సిటీ వీసీ మురళీధర్ శర్మ దానికి సంబంధించి అధికారిక ప్రకటన చేశారు. తిరుమలలో జరిగిన శ్రీరామనవమి వేడుకలలో ఆయన ఈ ప్రకటన చేశారు.

 
ఆకాశ గంగా తీర్థంలో పన్నెండేళ్ళపాటు అంజనాదేవి తపస్సు చేశారని, దానికి సంబంధించిన పౌరాణిక, వాజ్మయ, శాసన, చారిత్రిక ఆధారాలను సేకరించామని ఆయన తెలిపారు. వాటి కోసం నాలుగు నెలల పాటు శ్రమించామన్నారు. పండితులంతా కలిసి ఆధారాలు సేకరించినట్టు ఆయన వెల్లడించారు. అంజనాద్రిపై వెలసిన జపాలి తీర్థం హనుమంతుని జన్మ స్థలం అని మురళీధర్ శర్మ పేర్కొన్నారు.

 
ఆంజనేయుడి జన్మ స్థలమంటూ ఇప్పటికే అనేక ప్రాంతాలపై ప్రచారం. దేశంలో అనేక ప్రాంతాలను ఆంజనేయుని జన్మస్థలంగా చాలామంది నమ్ముతుంటారు. కొన్నిచోట్ల ఆలయాలు కూడా నిర్మించారు. అత్యధికులు విశ్వసించే స్థలాలు కూడా వీటిలో ఉన్నాయి. అక్కడ హనుమాన్‌ జయంతి సందర్భంగా ఘనంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు.

 
కర్ణాటకలో...
కర్ణాటక తుంగభద్ర తీరాన ఉన్న అనెగొంది ప్రాంతంలోని అంజనాద్రి అలాంటి వాటిలో ప్రధానమైనది. ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని కొప్పల్ జిల్లాలో ఈ అంజనాద్రి ఉంది. కిష్కిందగా పిలిచే ఈ ప్రాంతంలో రామాయణంలో పేర్కొన్న ఋష్య మూక పర్వతం కూడా ఉంది. రామాయణాన్ని అనుసరించి హనుమంతుడి జన్మస్థానం కర్ణాటకలో ఉందని శివమొగ్గలోని రామచంద్రపుర మఠం అధిపతి రాఘవేశ్వర భారతి అన్నారు.

 
సీతతో తాను సముద్ర తీరంలోని గోకర్ణలో జన్మించానని హనుమంతుడు రామాయణంలో చెబుతారని, దానిని బట్టి గోకర్ణ హనుమంతుడి జన్మభూమి అని ఆయన చెప్పారు. హంపికి 5 కి.మీ. దూరంలో ఉండే ఈ కొండకు అనేకమంది భక్తులు, యాత్రికులు వస్తుంటారు.

 
మహారాష్ట్రలో...
గోదావరి నదికి జన్మస్థానమైన నాసికా త్రయంబానికి చేరువలో అంజనీదేవి తపస్సు చేసినట్టు ఆ ప్రాంతం వారు నమ్ముతారు. అక్కడ కూడా ఓ ఆలయం ఉంది. హనుమంతుడికి ఇక్కడ పెద్ద ఎత్తున పూజలు జరుగుతాయి. భక్తులు కూడా ఎక్కువగా వస్తుంటారు.

 
గుజరాత్‌లో...
దంగ్‌ జిల్లా నవ్‌సారి ప్రాంతంలో అంజనీ గుహగా పిలిచే ప్రాంతం ఉంది. అక్కడే ఆంజనేయుడు పుట్టారని స్థానికుల నమ్మకం. ప్రత్యేక పూజా కార్యక్రమాలు అక్కడ జరుగుతూ ఉంటాయి.

 
జార్ఖండ్‌లో...
గుమ్లా జిల్లా కేంద్రానికి సమీపంలో అంజన్‌ గ్రామం ఉంది. వాలీ, సుగ్రీవుల రాజ్యాలు కూడా ఇక్కడివేనని, హనుమంతుడు తమ ప్రాంతంలోనే జన్మించారని అక్కడి వారు చెబుతారు. హనుమాన్ జయంతిని పెద్ద ఉత్సవంలా నిర్వహిస్తారు.

 
హరియాణాలో...
జిల్లా కేంద్రంగా ఉన్న కైతల్‌ పట్టణం ఒకప్పటి పేరు కపితల్‌ అని, అది ఆంజనేయుడు పుట్టిన స్థలమని ఈ ప్రాంతంలో చాలామంది భావిస్తారు. ఇవి కాక దేశంలో ఇంకా అనేక చోట్ల హనుమంతుడి జన్మస్థలం గురించి అనేక విశ్వాసాలు ప్రచారంలో ఉన్నాయి.

 
టీటీడీ కొత్త వాదన
హనుమంతుడి జన్మస్థలంగా ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న ప్రాంతాలను కాదని, చిత్తూరు జిల్లాలో హనుమంతుడి జన్మస్థలం ఉందని, అంజనాద్రే ఆయన పుట్టిన ప్రాంతమని టీటీడీ చెబుతోంది. తిరుమలలోని ఏడు కొండలకు పురాణాలు, ఇతిహాసాల్లో ఉండే కథలతో పాటుగా, వాటి రూపురేఖలను బట్టి శేషాద్రి, నీలాద్రి, గరుడాద్రి, అంజనాద్రి, వృషభాద్రి, నారాయణాద్రి, వెంకట్రాది అనే పేర్లున్నాయి.

 
వాటిలోని అంజనాద్రినే ఆంజనేయుడి జన్మస్థానంగా నిరూపిస్తామని టీటీడీ చెబుతోంది. దీనిని నిరూపించడానికి ఏకంగా ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసింది. టీటీడీ నియమించిన ఈ కమిటీ ఇప్పటికే పరిశోధనలు కూడా చేసిందని చెబుతున్నారు. తిరుమలలోని ఆకాశ గంగ తీర్థంలో అంజనా దేవి పవిత్ర స్నానమాచరించి, ఆంజనేయుడికి జన్మనిచ్చారనే వాదనను టీటీడీ ముందుకు తీసుకొచ్చింది.

 
తన వాదనకు మద్ధతుగా శిలా ఫలకాలు, రాగి రేకులు సహా అనేక శాస్త్రీయ ఆధారాలు సేకరించినట్టు చెబుతోంది. గత ఏడాది డిసెంబరులో టీటీడీ నియమించిన నిపుణుల కమిటీలో శ్రీవేంకటేశ్వర వేదిక్‌ విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ సన్నిధానం సుదర్శన శర్మ, జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉప కులపతి ప్రొఫెసర్‌ మురళీధర శర్మతో పాటు, భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) శాస్త్రవేత్త మూర్తీ రెమిల్లా, పురాతత్వ పరిశోధన సంస్థ (ఆర్కియాలజీ) ఉప సంచాలకులు విజయ్ కుమార్ వంటి వారు సభ్యులుగా ఉన్నారు. అనేక పరిశోధనలు, చారిత్రక ఆధారాలను బట్టి తిరుమలలోని అంజనాద్రిపైనే హనుమంతుడు జన్మించారని నిర్ధారణకు వచ్చినట్టు టీటీడీ చెబుతోంది.

 
టీటీడీకి అలాంటి అవకాశం ఉందా?
సుమారు ఆరు శతాబ్దాల కిందట తిరుమలలో శ్రీవారిని కీర్తిస్తూ వేల సంకీర్తనలు రచించిన తాళ్లపాక అన్నమయ్య మూలాల విషయంలో శాస్త్రీయ ఆధారాలు పూర్తిగా లేవని టీటీడీ చెబుతోంది. అన్నమయ్య మనువడు రచించిన పుస్తకం ఆధారంగానే అన్నమయ్య జనన, మరణాలతో పాటుగా సంకీర్తనల సంఖ్యపై నిర్ధారణకు వచ్చింది. అలాంటిది, త్రేతాయుగంలో శ్రీరాముడికి తోడుగా ఉన్నారని పురాణాల్లో పేర్కొన్న అంజనీపుత్రుడి జన్మస్థలం గురించి శాస్త్రీయ నిర్దరణ ఎలా సాధ్యం అనే ప్రశ్నలు ఉదయిస్తున్నాయి.

 
''ఇటీవల చిన్న పిల్లల ఆసుపత్రి నిర్మాణం కోసం విలువైన స్థలాలను ఓ అనామక సంస్థకు అప్పజెప్పబోయి టీటీడీ అభాసు పాలయింది. ఆ అనామక సంస్థ ఆర్థిక మూలాలు కూడా తెలుసుకోలేక పోయిన టీటీడీ, పురాణాల్లో ఉన్న వాటికి ఆధారాలు కనిపెడతానని అంటే విచిత్రంగా ఉంది'' అని మాజీ ఎమ్మెల్సీ, జన విజ్ఞాన వేదిక నాయకుడు డాక్టర్ గేయానంద్ అన్నారు.

 
''ఈ క్షేత్రానికి కానుకల రూపంలో నిత్యం కోట్లాది రూపాయల సంపద వస్తోంది. వాటిని సద్వినియోగం చేయాలి. కానీ ఇలాంటి వివాదాస్పద అంశాలతో పరువు తీసుకునే ప్రయత్నం తగదు. ప్రజల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడం పాలకుల కర్తవ్యంగా ఉండాలని మన రాజ్యాంగం నిర్దేశిస్తోంది" అని ఆయన అన్నారు. టీటీడీ రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంది. ఇలాంటి అసంబద్ధ అంశాలతో ప్రజల్లో కొత్త వివాదం రాజేయడం రాజ్యాంగ విరుద్ధం. శాస్త్రీయ ఆలోచనలకు బీజాలు వేయాల్సిన శాస్త్రవేత్తలు ఇలాంటి అశాస్త్రీయ క్రతువుల్లో భాగస్వాములు కావడం సిగ్గుచేటు'' అన్నారు గేయానంద్.

 
శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయంటున్న టీటీడీ
ఆంజనేయుడి జన్మస్థానం విషయంలో తమ వద్ద అన్ని ఆధారాలున్నాయని బోర్డు కార్య నిర్వహణాధికారి కేఎస్‌ జవహర్‌ రెడ్డి అన్నారు. అంజనాద్రి విషయంపై కర్ణాటక సహా ఇతర ప్రాంతాల వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేస్తామని బోర్డు అధికారులు చెబుతున్నారు.

 
''టీటీడీ వద్ద చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. వాటిని ప్రజల ముందుంచుతాం. అయోధ్య రామాలయం నిర్మిస్తున్న నేపథ్యంలో హనుమంతుని జన్మస్థలం కూడా నిర్ధారణ చేయాల్సి ఉంది. దానిపై పరిశోధనలు చేశాం. తిరుమల క్షేత్రం ఆధ్యాత్మిక క్షేత్రంగా మరింత కీలకం కాబోతోంది'' అని జవహర్ రెడ్డి మీడియాతో అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

భారత్‌లో కరోనా సునామీ.. పతనమవుతున్న ముడిచమురు ధరలు.. అయినా...