Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అయోధ్యలో వెలగనున్న 5.5లక్షల దీపాలు, గిన్నిస్ బుక్‌లోకి ఎక్కనున్న దీపోత్సవం

అయోధ్యలో వెలగనున్న 5.5లక్షల దీపాలు, గిన్నిస్ బుక్‌లోకి ఎక్కనున్న దీపోత్సవం
, శనివారం, 26 అక్టోబరు 2019 (18:51 IST)
అయోధ్యలో పేర్చిన దీపాలన్నీ ఈ సాయంత్రం వెలిగిపోనున్నాయి. ఆ నగరం పేరు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో చేరనుంది. రెండేళ్ల క్రితం 'దీపోత్సవం' పేరుతో రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ దీపాలను వెలిగించే కార్యక్రమం మొదలుపెట్టింది. ఏటేటా దీపాల సంఖ్యను పెంచుతూ వస్తున్నారు. ఈసారి ఐదున్నర లక్షల దీపాలను వెలిగించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం అంతా ప్రణాళిక ప్రకారం జరిగితే, ఈ కార్యక్రమానికి గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌‌లో స్థానం దక్కుతుంది.

 
సరయూ నది ఒడ్డుపై కట్టిన 'రామ్ కీ పౌడీ' ఈ దీపోత్సవానికి వేదిక. ఇక్కడ ఏ దిక్కున చూసినా దీపాలే కనిపిస్తున్నాయి. మెడలో వాలంటీర్ కార్డులు వేసుకున్న చాలా మంది దీపాలను సర్దే పనిలో నిమగ్నమయ్యారు. కొందరు నేలపై కూర్చొని దీపాలను పూల ఆకృతుల్లో పేర్చుతున్నారు. ఇంకొందరు స్టీల్ ఫ్రేముల్లో అమర్చుతున్నారు.

 
వాడి వికలాంగ్ సేవా సంస్థాన్ అనే స్వచ్ఛంద సంస్థ నుంచి వచ్చిన ఇలా శుక్లా అనే కార్యకర్త ఈ ఏర్పాట్లలో పాలుపంచుకుంటున్నందుకు సంతోషంగా కనిపించారు. తమ సంస్థ నుంచి దాదాపు 30 మంది ఇక్కడికి వచ్చినట్లు ఆమె చెప్పారు.

 
మెట్లపై అట్టముక్కలతో ఏర్పాటు చేసిన ఏనుగులు, గుర్రాలు, ఒంటెల బొమ్మలకు కొందరు స్థానిక పెయింటర్లు రంగులు అద్దుతున్నారు. మోతిహారి ఆలయం సమీపంలో బిహార్ నుంచి వచ్చిన అజయ్ కుమార్ ఝా బీబీసీ బృందానికి కలిశారు. కార్తీక మాసం అంతా తాను అయోధ్యలోనే ఉంటానని ఆయన చెప్పారు.

 
దీపోత్సవం ఘనంగా జరుగుతుందని విన్నామని, దాన్ని చూడాలని ముందే అయోధ్యకు వచ్చామని ఆయన వివరించారు. రామాయణంలోని అనేక ఘట్టాలను ప్రదర్శించేందుకు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. వీటిలో ఓ ప్రదర్శన కోసం రాముడు, సీత పాత్రదారులు హెలికాప్టర్‌లో కిందకి రానున్నారు. ఆ తర్వాత హారతి, దీపాలను వెలిగించే కార్యక్రమాలు జరగనున్నాయి.

 
రామ్ కీ పౌడీకి ఒక ఒడ్డున రామాయణ ఘట్టాల ప్రదర్శన సాగుతోంది. ఇక్కడి నుంచి 500-700 మీటర్ల దూరంలో అయోధ్య నగరం ఉంది. అక్కడ పాతబడిన దేవాలయాలు.. గడ్డి, చెట్లు మొలవడంతో అందం కోల్పోయిన ఇళ్లు కనిపించాయి. ''అంతా సాధువుల ఆట. వాళ్ల గల్లా పెట్టెలు నడుస్తున్నాయి. మఠాల్లోకి డబ్బులు వస్తున్నాయి. వారితో అయోధ్యకు ఎలాంటి సంబంధమూ లేదు'' అని స్థానిక పాత్రికేయుడు స్కందదాస్ చెబుతున్నారు.

 
మంత్రులు, అధికారులు, పాత్రికేయులు వెళ్లిపోయిన తర్వాతే తమకు దీపోత్సవం జరిగే చోటుకు వెళ్లే అవకాశం ఉంటుందని స్థానికులు అంటున్నారు. మూడేళ్ల క్రితం అయోధ్య పేరు ప్రస్తావించాలంటే జనాలు ఆలోచించేవారని, యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం పరిస్థితిని పూర్తిగా మార్చివేసిందని స్వచ్ఛంద కార్యకర్త ఇలా శుక్లా అభిప్రాయపడ్డారు. అయితే రామ్ కీ పౌడీ అభివృద్ధి జరిగిందని, స్థానికుల జీవితాల్లో మాత్రం ఎలాంటి మార్పూ లేదని అంజూ రఘువంశీ అనే యువతి అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చర్చకు సిద్ధమా?.. వర్ల రామయ్యకు ఎమ్యెల్యే సుధాకర్‌బాబు సవాల్‌